న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలో బీభత్సాన్ని సృష్టిస్తున్న కరోనాను ఎదుర్కోవటానికి కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై 18 ఏండ్లు నిండిన వారు కూడా కరోనా టీకా తీసుకోవచ్చని ప్రకటించింది. ప్రస్తుతం 45 ఏండ్లపైబడిన వారు మాత్రమే అర్హులుగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వయస్సును సడలిస్తూ కేంద్రం ప్రకటన చేసింది. ఈ నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అంతేకాదు.. కరోనా టీకాను తయారుచేస్తున్న కంపెనీలు ఆ టీకాలను ఇక మీదట బహిరంగ మార్కెట్లో కూడా విక్రయించుకోవటానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు దవాఖానలు, సంస్థలు.. వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచే టీకాలను నేరుగా సేకరించవచ్చని పేర్కొంది. సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో అత్యధికమంది ప్రజలకు టీకాను అందించాలనే ఉద్దేశంతో గత ఏడాది కాలంగా ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తున్నదని మోదీ ఈ సందర్భంగా అన్నారు. వీలైనంత తక్కువ సమయంలో అందరికీ వ్యాక్సిన్ అందేలా చూస్తామన్నారు. ఈ సమావేశం అనంతరం.. మూడో విడుత కొవిడ్-19 వ్యాక్సినేషన్ మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఆ వివరాలు..