హైదరాబాద్ : కరోనా బాధితులకు, ఈ మహమ్మారితో చిన్నాభిన్నమైన కుటుంబాలలో అవసరమైన వారికి ఆహారాన్ని అందించే మహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ పోలీస్శాఖ శనివారం ప్రారంభించింది. ముఖ్యంగా కొవిడ్తో పలువురు ఐసోలేషన్కు వెళ్లడం, కుటుంబాలకు కుటుంబాలే ఆస్పత్రుల పాలు కావడం వంటి సంఘటనలు చూస్తున్నాం. దీంతో ప్రస్తుత లాక్డౌన్లో అనేక మందికి ఆహరం కూడా లభ్యం కానీ పరిస్థితుల్లో పోలీస్శాఖ మహిళా భద్రతా విభాగం అన్నార్తులకు ఉచితంగా ఆహారాన్ని అందించేందుకు నడుం బిగించింది. నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ప్రతీరోజు కనీసం 2 వేల మదికి ఉచిత భోజనం అందించే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించింది..
దీనిలో భాగంగా సికిందరాబాద్ బోయినపల్లి సమీపంలోని శోభా గార్డెన్లో సేవా ఆహార్ పేరుతో ఏర్పాటు చేసిన సెంట్రల్ కిచెన్ను ఈ ఉదయం మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతీ లక్రా, డీఐజీ బి. సుమతి పరిశీలించారు. ఈ సందర్బంగా ఏడీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. ప్రస్తుత లాక్డౌన్ కాలంలో కరోనా భాదితులకు, భాదిత కుటుంబాలకు సేవాభావంతో ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. నగరంలోని అనేక స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో అందించే ఈ ఉచిత భోజన కార్యక్రమంలో మహిళా భద్రాతా విభాగం ప్రధానపాత్ర వహిస్తోందని తెలిపారు.
నగరంలోని ప్రధాన ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, కింగ్ కోటి, నిమ్స్ తదితర ఆసుపత్రుల్లో పేషంట్లు వారి అటెండెంట్లకు ఈ ఉచిత భోజనాన్ని అందిస్తున్నామని డీఐజీ సుమతి వివరించారు. అక్షయ పాత్ర, సత్యసాయి సేవా సమితి తదితర ప్రముఖ సంస్థల సహాయ సహకారాలతో నిర్వహించే ఈ సేవా ఆహార్ కార్యక్రమంలో స్విగ్గి, బిగ్ బాస్కెట్, జొమాటో తదితర సంస్థలను కూడా భాగస్వామ్యం చేసినట్లు వెల్లడించారు.