న్యూఢిల్లీ : రాజ్యసభలో ఇవాళ కోవిడ్19పై చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. కరోనాతో చనిపోయిన మృతుల్లో ప్రభుత్వం అండర్ రిపోర్టింగ్ చేసినట్లు ఆయన ఆరోపించారు. కరోనా వారియర్లు, డాక్టర్లు, పారామెడిక్ వర్కర్లు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఖర్గే నివాళి అర్పించారు. గంగా నదిలో శవాలు కొట్టుకువస్తున్న, రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికుల, ఆక్సిజన్ కోసం ఎదురుచూస్తున్న రోగుల ఫోటోలను ఆయన సభలో చూపించారు. కోవిడ్ వల్ల 5.5 లక్షల మంది చనిపోయినట్లు ప్రభుత్వం చెబుతోందని, కానీ కోవిడ్ మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఆరు లక్షల గ్రామాలు, ఏడు వేల పట్టణాలు, 18 మెట్రో సిటీల్లో సంభవించిన మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ఖర్గే అన్నారు.
వెంటిలేటర్లు, ఆక్సిజన్ కొరతలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. కోవిడ్ టీకా కొరత కూడా ఉన్నట్లు ఆరోపించారు. చాలా తక్కువగా, చాలా ఆలస్యంగా కోవిడ్ టీకాల కోసం ఆర్డర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. డిసంబర్ చివరినాటికి దేశమంతా వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని చెబుతున్నారని, కానీ ఇప్పటి వరకు కేవలం 5.3 శాతం మంది మాత్రమే రెండవ డోసు వేసుకున్నట్లు ఆయన చెప్పారు. కోవిడ్ను ఎదుర్కొన్న తీరు వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఆయన ఆరోపించారు. కేంద్ర మాజీ ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ను బలిపశువును చేశారని, కానీ కోవిడ్ సంక్షోభానికి ప్రధాని మోదీని బాధ్యుడిని చేయాలని ఖర్గే అన్నారు. సోషల్ డిస్టాన్స్ పాటించాలన్నారు, మాస్క్లు పెట్టుకోవాలన్నారు, కానీ ఎన్నికల ప్రచారం వేళ అవన్నీ మరిచిపోయినట్లు ఆరోపించారు.