న్యూఢిల్లీ: ఓలా.. అంటే దేశ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు.. దేశవ్యాప్తంగా ప్రైవేట్ రవాణా సర్వీస్.. ఆధునిక భాషలో క్యాబ్ సర్వీస్గా ఓలా మొబిలిటీ ఎంతో ప్రజాదరణ పొందింది. భూతాప నివారణకు కాలుష్య రహిత ఇంధనం.. విద్యుత్ ఆధారిత వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నది ప్రపంచ దేశాల అభిమతం.. ఆ లక్ష్యం సాధన దిశగా ఓలా ముందుకెళ్లాలని సంకల్పించింది.. తద్వారా ఆ సంస్థ తాజాగా భవిష్యత్ వ్యక్తిగత మొబిలిటీకి కేంద్రంగా తన పేరును నిలుపుకోవాలని ఆకాంక్షిస్తున్నది.. భారత్ కేంద్రంగా ప్రపంచ విద్యుత్ వాహన విపణిపై పట్టు సాధించేందుకు కసరత్తు ప్రారంభించింది.
ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థను నెలకొల్పేందుకు సిద్దమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరుకు కొద్ది దూరంలోని తమిళనాడు రాష్ట్రపరిధిలోని ప్రాంతంలోని ‘ఓలా ఫ్యూచర్ఫ్యాక్టరీ’కి శంకుస్థాపన జరిగింది. 500 ఏకరాల స్థలంలో ఈ ప్లాంట్ను నెలకొల్పనున్నది. దీని కోసం ఏకంగా రూ.241 కోట్లకు పైగా(330 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెడుతున్నది.కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) భవిష్ అగర్వాల్ వారాంతంలో ఇక్కడే గడుపుతూ కంపెనీ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయితే వచ్చే ఏడాది వేసవిలోగా కోటి ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేయాలని, అంటే ప్రపంచంలో తయారయ్యే మొత్తం ఎలక్టిక్ స్కూటర్లలో 15 శాతం తయారు చేయాలని ఓలా భావిస్తోంది. అంటే ప్రతి రెండు సెకన్లకు ఓ ఎలక్ట్రికల్ స్కూటర్ తయారవుతుందన్నమాట. దీనిపై ఓలా ఫౌండర్ భవిష్ అగర్వాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తమ ఫ్యాక్టరీ ప్రపంచ ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో భారత్ పేరు కూడా నిలుపుతుందనే నమ్మకం తమకుందని అన్నారు. భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో రాణించేందుకు భారత కంపెనీల వద్ద శక్తి, నైపుణ్యాలు సమృద్ధిగా ఉన్నాయని అన్నారు.