శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య రజా బేగం, కూతురు రఫియా హత్యల వెనుక జైష్ ఎ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నదని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. జైషే మహమ్మద్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఈ హత్యలకు పాల్పడ్డారని, వాళ్లలో ఒకడు విదేశీ ఉగ్రవాది ఉన్నాడని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు.
ఆదివారం రాత్రి పోలీస్ ఆఫీసర్ ఫయాజ్ అహ్మద్ ఇంట్లోకి ఇద్దరు ఉగ్రవాదులు చొరబడి ఆయన కాల్చిచంపారు. కశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన ఎస్పీవో ఫయాజ్ అహ్మద్ పుల్వామా జిల్లాలోని అవంతిపొర సమీపంలోని హరిపరిగ్రామ్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన ఇంట్లోకి చొరబడిన టెర్రరిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
దాంతో ఫయాజ్ అహ్మద్ అక్కడికక్కడే మృతిచెందారు. ఫయాజ్ను కాపాడేందుకు ప్రయత్నించిన ఆయన భార్య రజా బేగమ్, కుమార్తె రఫియాపై కూడా ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ రజా బేగం, రఫియాలను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రజా బేగం, రఫియా మృతిచెందినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. బాధ్యులైన ఇద్దరు టెర్రరిస్టులను సాధ్యమైనంత త్వరలో అంతం చేస్తామని ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.