న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితికి ప్రభుత్వంతోపాటు ప్రజల నిర్లక్ష్యం కారణమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ విమర్శించారు. కరోనా మొదటి వేవ్ తర్వాత ప్రభుత్వం, ప్రజలు సురక్షిత మార్గాలను వదిలేశారని, దీంతో ప్రస్తుత పరిస్థితికి దారి తీసిందని ఆరోపించారు. అయితే ఇలాంటి సంక్షోభ సమయంలో ఒకరిపై ఒకరు వేలెత్తుకునే బదులు కరోనా నియంత్రణకు కలిసికట్టుగా పని చేయాలని దేశ పౌరులకు సూచించారు.
పాజిటివిటీ అన్లిమిటెడ్ పేరుతో ఆన్లైన్లో నిర్వహిస్తున్న వరుస ప్రసంగాల్లో భాగంగా మోహన్ భగవత్ శనివారం కీలక ప్రసంగం చేశారు. కరోనా మూడో వేవ్ పొంచి ఉన్నదన్న ఆయన ప్రజలు భయాందోళన చెందవద్దన్నారు. కరోనా నెగెటివ్గా ఉండేందుకు మనం పాజిటివ్గా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ పరిస్థితితో మోహన్ భగవత్ పోల్చారు. అన్ని ఆశలు కోల్పోయినట్లు అనిపించినప్పుడు కూడా, అప్పటి బ్రిటీష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ డెస్క్ మీద ఒక కోట్ ఇలా ఉన్నదని గుర్తు చేశారు. “ఈ కార్యాలయంలో నిరాశావాదం లేదు. ఓటమి అవకాశాలపై మాకు ఆసక్తి లేదు. అవి ఉనికిలో లేవు “అని రాసి ఉన్నదని చెప్పారు. దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న ప్రస్తుత పరిస్థితిలో “ మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. మనం ఉక్కు సంకల్పం కలిగి ఉండాలి ”అని ఆయన వ్యాఖ్యానించారు.