రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
జల్పల్లిలో షాదీముబారక్ చెక్కుల పంపిణీ
షాబాద్, మే 8: తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితారెడ్డి అన్నారు. శనివారం జల్పల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1500 మందికి రూ.15 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద 8లక్షల 4వేల మందికి చెక్కులు అందివ్వగా, ఇందులో లక్షా 70వేల మంది ముస్లిం లబ్ధిదారులు ఉన్నారన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 2700 కోట్ల కేటాయిస్తుందన్నారు. ఇంత పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తూ ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపాలని సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు జల్పల్లి మున్సిపాలిటీలో పాక్షికంగా, పూర్తిగా ఇండ్లు దెబ్బతిన్న బాధితులకు రూ.25లక్షలు పరిహారంగా అందించినట్లు తెలిపారు. దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలకు కానుకలు పంపిణీ చేస్తూ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సాధి, వైస్ చైర్మన్ ఫర్హాననాజ్, పార్టీ అధ్యక్షుడు ఖలీఫా, నాయకులు కృష్ణారెడ్డి, యూసుఫ్పటేల్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.