న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (ఎమ్వోఆర్టీహెచ్) ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడటంలో సహాయ పడే వ్యక్తికి రూ.5,000 నగదును బహుమతిగా ఇవ్వనున్నది. సమాజంలో ‘మంచి సమారిటన్ల’ను ప్రొత్సహించేందుకు ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
అత్యవసర పరిస్థితిలో రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడంలో సాధారణ ప్రజలను చైతన్య పరచడానికి ఈ పథకాన్ని లాంచ్ చేసినట్లు ఎమ్వోఆర్టీహెచ్ తెలిపింది. ప్రతి గుడ్ సమారిటన్కు రూ.5,000 నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తామని పేర్కొంది.
దీనితో పాటు ప్రతి ఏటా వీరిలో పది మందిని ఎంపిక చేసి లక్ష నగదు చొప్పున జాతీయ స్థాయి అవార్డుతో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ సత్కరించనున్నది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు జారీ చేసింది.