న్యూఢిల్లీ, జూన్ 7: దేశంలో అందుబాటులో ఉన్న రెండు రకాల టీకాల్లో.. కొవాగ్జిన్కన్నా కొవిషీల్డ్తోనే యాంటీబాడీల (ప్రతిరక్షకాల) ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్నదని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అయితే, కొవాగ్జిన్తో కూడా రోగనిరోధక వ్యవస్థ బాగానే వృద్ధి చెందుతున్నదని తెలిసింది. కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్న 515 మంది ఆరోగ్య సిబ్బందిపై దేశవ్యాప్తస్థాయిలో ఈ అధ్యయనం జరిగింది. వీరు రెండుడోసుల టీకాలను తీసుకున్న వాళ్లు. వీరి నుంచి రక్తం నమూనాలు తీసుకొని దాంట్లో కరోనా వైరస్పై పోరాడే యాంటీబాడీలు ఏ స్థాయిలో ఉన్నాయో పరీక్షించారు.
ఈ అధ్యయనం వివరాలు..
మొత్తం 515 మందికిగాను 425 మంది కొవిషీల్డ్, 90 మంది కొవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్నారు. కొవిషీల్డ్ తీసుకున్నవాళ్లలో 98.1 శాతం, కొవాగ్జిన్ తీసుకున్నవారిలో 80 శాతం సెరోపాజిటివిటీ కనిపించింది.
కరోనా స్పైక్ప్రోటీన్పై దాడి చేసే యాంటీబాడీలను కూడా పరిశీలించినప్పుడు.. కొవిషీల్డ్ తీసుకున్నవారిలో 127 అబ్సార్బెన్స్ పర్ మిల్లీలీటర్ నమోదుకాగా.. కొవాగ్జిన్ గ్రహీతల్లో ఇది 53గా ఉంది.
కొవిషీల్డ్ తీసుకున్నవారిలో 60+ వారితో పోల్చితే తక్కువ వయసు వారిలో యాంటీబాడీల ఉత్పత్తి ఎక్కువగా ఉంది.
టైప్-2 డయాబెటిస్ వారిలో యాంటీబాడీలు తక్కువగా ఉత్పత్తి అయ్యాయి.
కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత రెండు డోసుల టీకా తీసుకున్నవారిలో, కరోనా బారిన పడకుండా రెండు డోసుల టీకా తీసుకున్నవారిలోకంటే గణనీయంగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి.
టీకా రెండో డోసు తీసుకున్నాక 2వారాల్లో కరోనా సోకిన వారి సంఖ్య 4.9 శాతం.