గజ్వేల్ రూరల్, మార్చి13 : గజ్వేల్ సమీపంలోని మూట్రాజ్పల్లి వద్ద నిర్మించిన కాలనీలోకి కొండపాక మండలం సింగారం గ్రామస్తులు ఒక్క రోజే 56 కుటుంబాలు సామూహిక గృహ ప్రవేశాలు చేశారు. సింగారం గ్రామస్తులు ఆర్అండ్ఆర్ కాలనీలోని కొత్త ఇండ్ల మధ్య సీఎం కేసీఆర్, చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రెవెన్యూ అధికారులు దగ్గరుండి వారికి అన్ని రకాలుగా సహకరించారు. గజ్వేల్ పట్టణ సమీపంలోని మూట్రాజ్పల్లి వద్ద నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలో సింగారం గ్రామానికి చెందిన 181 కుటుంబాలకు డబుల్బెడ్రూం ఇండ్లను రెవెన్యూ అధికారులు కేటాయించగా, గురువారం మంచి రోజు కావడంతో గృహప్రవేశాలు చేశారు. కొత్త ఇండ్లలో పాలుపొంగించి, గుమ్మాలకు తోరణాలు, పూల దండలు వేసి గుమ్మడి కాయలు, టెంకాయలు కొట్టి, కొత్త ఇంట్లోకి అడుగులు పెట్టారు. బంధువులు, సహకుటుంబ సభ్యులతో కలిసి దేవుడి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి కాలనీలో సందడి వాతావరణం కనిపించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రామస్తులు కాలనీకి చేరుకున్నారు. మల్లన్నసాగర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతుండడంతో త్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయించి అధికారులు లబ్ధిదారులకు అందజేశారు. నూతన ఇండ్ల గృహ ప్రవేశాలకు గజ్వేల్ ఆర్డీవో విజయేందర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.