పనాజీ: గోవాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం లుయిజిన్హో ఫలీరో సోమవారం ఆ పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని పొగిడిన ఆయన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఫలీరో, తృణమూల్ కాంగ్రెస్లో చేరవచ్చని తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి 40 ఏండ్లుగా సేవలందించిన ఆయన ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘మమతా బెనర్జీ నరేంద్ర మోడీకి గట్టి పోటీ ఇచ్చారు. బెంగాల్లో మమత ఫార్ములా గెలిచింది’ అని అన్నారు. మమతా బెనర్జీని ఒక వీధి పోరాట యోధురాలిగా అభివర్ణించారు.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరుతారా అన్న మీడియా ప్రశ్నకు ఫలీరో పరోక్షంగా సమాధానమిచ్చారు. ‘నేను కొంతమందిని కలిశాను. 40 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాడినని వారు చెప్పారు. నేను కాంగ్రెస్ కుటుంబానికి చెందిన కాంగ్రెస్గా కొనసాగుతాను. నాలుగు కాంగ్రెస్లలో ప్రధాని నరేంద్ర మోదీకి మమత గట్టి పోటీ ఇచ్చారు. బెంగాల్లో పీఎం మోదీ 200, అమిత్ షా 250 సమావేశాలు నిర్వహించారు. ఈడీ, సీబీఐ కూడా వారి వెంట ఉన్నాయి. అయినప్పటికీ మమత ఫార్ములా గెలిచింది’ అని అన్నారు. ఒకే పార్టీ సిద్ధాంతం, విధానాలు, సూత్రాలు, కార్యక్రమాలు ఉన్నటువంటి యోధులు మనకు కావాలని, బీజేపీతో పోరాడటానికి అన్ని కాంగ్రెస్ పార్టీలు కలిసి రావాలని తాను కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, ఫలేరోతో చర్చలు జరిపేందుకు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు డెరెక్ ఓ బ్రియాన్, ప్రసూన్ బెనర్జీ గోవాలో ఉన్నారు. వచ్చే ఏడాది గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ జోరు పెంచింది. మరోవైపు ఫలేరో నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నది.