హైదరాబాద్ : సైబర్నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. పైసా కంటే పరువు ముఖ్యమనుకునే వాళ్లను లక్ష్యంగా చేసుకొని లక్షలు దోచేస్తున్నారు. ఫేస్బుక్లో స్నేహితురాలిగా పరిచయం అయి.. ఆ తరువాత నగ్న వీడియోలతో బాధితులను బ్లాక్మెయిల్ చేస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సైబర్క్రైమ్ ఠాణా పరిధిలో ఓ ఈవెంట్ మేనేజర్ను బ్లాక్మెయిల్ చేసి రూ. 10 లక్షలు వసూలు చేసిన ఘటన వెలుగులో కి వచ్చింది. తార్నాక ప్రాంతంలో నివాసముండే ఓ ఈవెంట్ మేనేజర్కు ఫేస్బుక్లో ఓ యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయంతో ఇద్దరు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. ఆ తరువాత వాట్సాప్లో చాటింగ్ చేస్తూ, బాధితుడిని సైబర్నేరగాళ్లు రెచ్చగొట్టారు. ముందుగా తమ వద్ద ఉన్న వీడియోలు, అప్లికేషన్ల సహాయంతో నగ్న వీడియోలను ప్లే చేస్తూ బాధితుడిని బుట్టలో వేశారు. వాటితో బాధితుడిని రెచ్చగొట్టి, అతడితో నగ్నంగా చాటింగ్ చేయించారు. ఆ చాటింగ్ను వీడియో రికార్డు చేసి.. బాధితుడిని బ్లాక్మెయిల్ చేశారు. మేం అడిగినంత ఇవ్వకపోతే ఈ వీడియోలు సోషల్మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ బెదిరిస్తూ బాధితుడి నుంచి దఫ దఫాలుగా రూ. 10 లక్షలు వసూలు చేశారు. మొదటిసారి కొంత డబ్బు ఇవ్వగానే పరువు కోసం బాగా పాకులాడుతున్నాడని భావించిన సైబర్ క్రిమినల్స్.. రెండో దఫా కూడా డిమాండ్ చేస్తూ వసూలు చేశారు. ఇంకా డబ్బు అడుగుతుండటంతో బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.