పనాజీ : గోవా బీచ్లో జులై 25న ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటనపై తాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో సీఎం ప్రమోద్ సావంత్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో తాను సందర్భానికి తగినట్టుగా తాను వ్యాఖ్యానించానని చెప్పారు. తోటి పౌరులు, చిన్నారుల పట్ల ప్రేమానురాగాలు, వారి పట్ల శ్రద్ధతోనే తాను అలా మాట్లాడానని అన్నారు. మహిళలు, బాలికలు, చిన్నారుల క్షేమం, భద్రత తన ప్రభుత్వ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు.
రాష్ట్రాధినేతగానే కాకుండా 14 ఏండ్ల బాలిక తండ్రిగా బాధతో తాను అలా మాట్లాడానని చెప్పుకొచ్చారు. పిల్లల భద్రతపై తల్లితండ్రులకు బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. కాగా గోవా బీచ్లో అర్ధరాత్రి దాటిన తర్వాత మైనర్ బాలికలు ఎందుకు ఉన్నారనేది వారి తల్లితండ్రులు ఆలోచించుకోవాలని బుధవారం అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
పిల్లలు తల్లితండ్రుల మాట వినకుంటే మనం పోలీసులు, ప్రభుత్వాన్ని నిందించలేమని ప్రమోద్ సావంత్ పేర్కొనడం దుమారం రేపింది. రాష్ట్ర పౌరులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని విపక్షాలు సీఎం వ్యాఖ్యలపై విరుచుకుపడ్డాయి. ఆయన తన వ్యాఖ్యలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ సర్ధేశాయ్ డిమాండ్ చేశారు. గోవాలో శాంతిభద్రతలు క్షీణించాయని కాంగ్రెస్ ప్రతినిధి అల్టోన్ డీకొస్టా విమర్శించారు.