పనాజీ : గోవా బీచ్ వద్ద ఇద్దరు మైనర్ బాలికలపై సామూహిక లైంగిక దాడి ఉదంతం కలకలం రేపుతుండగా సీఎం ప్రమోద్ సావంత్ చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని రాజేశాయి. సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని విపక్షాలు మండిపడ్డాయి. తమ పిల్లలు అర్ధరాత్రి దాటినా బీచ్ల్లో ఎందుకు గడుపుతున్నారో తల్లితండ్రులు కన్నేసి ఉంచాలని గోవా సీఎం వ్యాఖ్యానించారు.
14 ఏండ్ల వయసున్న పిల్లలు రాత్రి అంతటా బీచ్ల వద్ద ఉంటే తల్లితండ్రులు దానిపై ఆలోచించాలని, పిల్లలు వారి మాట వినకుంటే మనం బాధ్యతను ప్రభుత్వం లేదా పోలీసుల మీద నెట్టివేయలేమని గోవా అసెంబ్లీ వేదికగా ఆయన పేర్కొన్నారు. తల్లితండ్రులు తమ పిల్లల భద్రత బాధ్యత తీసుకోవాలని వారిని అర్ధరాత్రి వరకూ బయటకు పంపకూడదని హితవు పలికారు. ఇక సీఎం వ్యాఖ్యలను విపక్షాలు తప్పుపట్టాయి.
పౌరుల భద్రత పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని, సీఎం వ్యాఖ్యలు అర్ధరహితమని గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన విజయ్ సర్ధేశాయ్ అన్నారు. పౌరులకు భద్రత కల్పించలేకపోతే సీఎంకు ఆ పదవిలో ఉండే హక్కులేదని స్పష్టం చేశారు. ఇక రాత్రి వేళ తిరగడానికి భయం ఎందుకు ఉండాలని, నేరస్తులు జైల్లో ఉండాలని..పౌరులు స్వేచ్ఛగా తిరిగే పరిస్ధితి ఉండాలని కాంగ్రెస్ ప్రతినిధి అల్టోన్ డి కోస్టా పేర్కొన్నారు.