కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం జారీ చేసిన మాస్క్ నిబంధన పక్కాగా అమలయ్యేలా చేస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ కూడళ్లు, వారి వారి పోలీస్స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది.. ప్రజలు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. మాస్కులు ధరించకుండా బయటకు వచ్చిన వారికి అవగాహన కల్పించారు. పలుచోట్ల కేసులు నమోదు చేశారు.
రెండో స్థాయిలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ను ధరించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. మాస్క్ ధరించడంపై ప్రజలలో వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన మాస్క్ నిబంధన ప్రతి ఒక్కరూ పాటించాలని సీపీ అన్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నడుంబిగించారు.
జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద మాస్కులను ధరించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మాస్కులు లేని వాహనదారులకు అందించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మాస్కులు ధరించేలా తమవంతు అవగాహన కల్పిస్తున్నామని, కొన్నాళ్ల తర్వాత పద్ధతి మార్చుకోకపోతే జరిమానా విధిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ గోవర్ధన్ పాల్గొన్నారు. కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. మాస్క్ ధరించకుండా వ్యాపారం నిర్వహించినా.. బయట తిరిగినా కేసులు నమోదు చేస్తున్నారు.
హిమాయత్నగర్: కరోనా వైరస్ రెండో దశలో విస్తృతంగా వ్యాపిస్తున్నందున్న ప్రతి పౌరుడు మాస్కు ధరించి అప్రమత్తంగా ఉండాలని నారాయణగూడ ట్రాఫిక్ పీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ అన్నారు. మంగళవారం హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో వాహనదారులకు మాస్కులు పంపిణీ చేసి కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం మాస్కు ధరించడం అనేది అలవాటుగా మార్చుకుని భౌతికదూరం పాటించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారికి జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై మల్లయ్యతో పాటు వాహనదారులు పాల్గొన్నారు.