న్యూఢిల్లీ: దేశంలో ప్రధాని నరేంద్రమోదీ పాలన ఒకప్పుడు లిబియాలో గడాఫీ పాలన, ఇరాక్లో సద్దాం హుస్సేన్ పాలనలా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఉదయం పార్లమెంట్ ఆవరణలో మీడియా ప్రతినిధులు రాహుల్గాంధీ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటీ అని ప్రశ్నించగా.. ఆయన వ్యాఖ్యలపై స్పందించడం శుద్ధ దండుగ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై మాట్లడటంవల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు.
భారతదేశంలోని ప్రజాస్వామ్యానికి గఢాఫీ, సద్దాం హుస్సేన్ల పాలనతో ముడిపెట్టి వ్యాఖ్యలు చేయడం దారుణమని జవదేకర్ విమర్శించారు. రాహుల్గాంధీ వ్యాఖ్యలు దేశంలోని 80 కోట్ల మంది ఓటర్లను అవమానపర్చేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన ఒక్క ఏడాది తప్ప దేశంలో గడాఫీ, సద్దాం హుస్సేన్ల తరహా పాలన ఎప్పుడూ లేదని ఆయన రాహుల్గాంధీకి కౌంటర్ ఇచ్చారు.