హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద ముప్పు, మహిళలు, చిన్నారులపై పెరుగుతున్న నేరాలు వంటి అనేక సవాళ్లకు యువ ఐపీఎస్ అధికారులు పరిష్కారం చూపాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ పిలుపునిచ్చారు. దేశ అంతర్గత భద్రత, ప్రజలకు న్యాయం చేసేందుకు యువ అధికారులు ముందుండాలని సూచించారు. 72వ బ్యాచ్కు చెందిన 178 మంది యువ ఐపీఎస్లు శిక్షణ పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం సర్దార్ వల్ల భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు. దీనికి నిత్యానందరాయ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యువ ఐపీఎస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించి వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ ఐపీఎస్లుగా మహిళల సంఖ్య పెరగుతుండటం సంతోషించే విషయమని, మరింతమంది రావాలని ఆకాంక్షించారు. కరోనా పరిస్థితుల్లోనూ శిక్షణ ఇచ్చిన జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అతుల్ కర్వాల్, సిబ్బందిని ఆయన అభినందించారు. అతుల్ కర్వాల్ మాట్లాడుతూ 178 మందిలో 144 మంది ఐపీఎస్లతో పాటు భూటన్, నేపాల్, మాల్దీవ్స్, మారిషస్లకు చెందిన 34 మందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. శిక్షణ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు కేంద్రమంత్రి ట్రోఫీలను అందజేశారు. పరేడ్ కమాండర్గా వ్యవహరించిన రాజస్థాన్ క్యాడర్ అధికారిణి రంజీతశర్మకు ప్రధానమంత్రి బ్యాటన్, హోంమంత్రి రివాల్వర్ను బహూకరించారు.