పూడూరు, జూన్ 15 : తిర్మలాపూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంతో సమస్యలకు చెక్ పడింది. గ్రామానికి వచ్చే రహదారిని బీటీగా మార్చడం, ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణం, చెత్త సేకరణకు ట్రాక్టర్ కొనుగోలు, డంపింగ్యార్డు, శ్మశానవాటిక, వర్మీ కంపోస్ట్ షెడ్డు, ప్రకృతి వనం, నర్సరీ వంటి అభివృద్ధి పనులతో గ్రామ రూపురేఖలు మారాయి. ప్రభుత్వం ప్రతి నెలా నిధులను అందిస్తుండడంతో పనులు సజావుగా సాగుతున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలోని పాడుబడిన ఇండ్లు, బావులను తొలగించడంతోపాటు నిత్యం పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నారు. దీంతో గ్రామంలో ఎక్కడ చూసినా పరిశుభ్రతే దర్శనమిస్తున్నది. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు అందుతున్నది.
గ్రామ స్వరూపం..
తిర్మలాపూర్ గ్రామ పంచాయతీ, అనుబంధ గ్రామం రాకంచర్లతో కలిపి మొత్తం జనాభా 2400 ఉన్నది. నివాసాలు తిర్మలాపూర్లో 380, రాకంచర్లలో 290 ఉన్నాయి. మొత్తం ఓటర్లు 1823 మంది ఉండగా.. 60 శాతం అక్షరాస్యత ఉన్నది.
రూ.12.50లక్షలతో శ్మశాన వాటిక…
గ్రామ పంచాయతీ పరిధిలోని రాకంచర్లలోని ప్రభుత్వ స్థలంలో రూ.12.50లక్షలతో వైకుంఠధామం నిర్మిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని సర్పంచ్ కమ్లీబాయి తెలిపారు. 3 కిలో మీటర్ల మేర రూ.1.60లక్షలు బీటీ రోడ్డు నిర్మించారు. అలాగే రూ..16 లక్షలతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించారు. గ్రామ పంచాయతీలోని చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు, మొక్కలకు నీరు అందించేందుకు రూ.10లక్షలతో ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా రూ.1.24లక్షల నిధులుతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. హరితహారం ద్వారా గత సంవత్సరం గ్రామ పంచాయతీ పరిధిలో సుమారుగా 12వేల మొక్కలను నాటారు. ఈ ఏడాది కోసం గ్రామ నర్సరీలో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.