పాదాలకు పరుగు నేర్పడం కాదు.. పరుగుకే పాఠాలు నేర్పిన భారత దిగ్గజ స్ప్రింటర్.. భూలోకంలో రన్నింగ్ ట్రాక్ను వీడి గగనతలానికి పయనమయ్యారు! లక్ష్యాన్ని మైళ్లలో.. కిలోమీటర్లలో లెక్కించడం కాదు.. అడుగుల చప్పుడుకే గమ్యం పాదాక్రాంతమవ్వాలని బలంగా నమ్మిన ఆ ఆజానుభావుడు పరుగు చాలించి.. గాఢనిద్రలోకి జారుకున్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన ఆ గుండె కరోనా బారిన పడి ఆగిపోయింది. కొవిడ్ నుంచి కోలుకొని తిరిగి పరుగందుకుంటారని దేశమంతా బలంగా నమ్మినా.. అభిమానులను శోకసంద్రంలో ముంచి ఆయన ఒంటరిగా పయనమైపోయారు..! శత్రు దేశాల అధినేతల నుంచే బిరుదులు పొందిన మిల్కా..నీ రికార్డులు తిరగరాసేందుకు మళ్లీ వస్తావా!!
జననం: 20 నవంబర్ 1929
మరణం: 18 జూన్ 2021
కామన్వెల్త్ గేమ్స్(కార్డిఫ్)-440 అడుగులు: స్వర్ణం
ఆసియా గేమ్స్
1958 టోక్యో 200మీటర్లు- స్వర్ణం
400 మీటర్లు- స్వర్ణం
1962 జకార్త 400మీటర్లు-స్వర్ణం
4 X 400మీటర్లు- స్వర్ణం
జాతీయ క్రీడలు: 1958(కటక్):
200మీటర్లు: స్వర్ణం, 400మీటర్లు: స్వర్ణం
1964(కోల్కతా): 400మీటర్లు: రజతం
అవార్డులు: పద్మశ్రీ(1959)
ఇండియన్ ఆర్మీలో గౌరవ కెప్టెన్గా హోదా
చండీగఢ్: దిగ్గజ స్ప్రింటర్, ఫ్లయింగ్ సిక్ మిల్కాసింగ్ కన్నుమూశారు. నెల రోజులుగా కరోనా వైరస్తో పోరాడుతున్న భారత అథ్లెటిక్స్ శిఖరం శుక్రవారం అర్ధరాత్రి నేలకొరిగింది. కొవిడ్-19 సోకినప్పటి నుంచి దవాఖానలో చికిత్స పొందుతున్న 91 ఏండ్ల మిల్కాసింగ్కు ఇటీవల నెగిటివ్ అని తేలడంతో జనరల్ ఐసీయూకు తరలించారు. కాగా.. శుక్రవారం జ్వరంతో పాటు శ్వాస సమస్యలు తలెత్తడంతో పరిస్థితి విషమించగా.. అర్ధరాత్రి సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఇటీవలే మిల్కాసింగ్ భార్య, భారత వాలీబాల్ మాజీ కెప్టెన్ నిర్మల్కౌర్ (85) కూడా కరోనా బారినే పడి మృతిచెందారు.
పసిప్రాయం నుంచే కష్టాలు కన్నీళ్లను అలవాటు చేసుకుంటూ పైకెదిగిన మిల్కాసింగ్.. ఆర్మీ క్యాంప్లో అదనపు సౌకర్యాలపై ఉన్న మమకారంతో రన్నింగ్ ట్రాక్వైపు ఆకర్శితమయ్యారు. ప్రాక్టీస్లో మిల్కా వేగానికి ఆశ్చర్యపోయిన ఉన్నతాధికారులు మెరుగైన ట్రైనింగ్ ఇప్పించడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తొలుత 200 మీటర్ల విభాగంలో పోటీపడ్డ మిల్కా.. ఆ తర్వాతన తన బలాలను గుర్తించి 400 మీటర్ల విభాగానికి మారారు. ఇక అప్పటి నుంచి ఓ దశాబ్ద కాలం పాటు మిడిల్ డిస్టాన్స్లో మిల్కాను ఓడించేవారే లేకుండా పోయారు. ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు సాధించి ఫ్లయింగ్ సిక్ బిరుదు పొందిన మిల్కా.. 1958 కామన్వెల్త్ గేమ్స్లో పసిడి పతకంతో మెరిశారు. 1956 నుంచి 1964 వరకు భారత్ తరపున ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించిన మిల్కా.. 1960 రోమ్ విశ్వక్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకున్నారు.
కెరీర్ ఆరంభంలో హైదరాబాద్లోనే తన పరుగుకు పదును పెంచుకున్న మిల్కా.. తర్వాతి కాలంలో నగరంతో అనుబంధాన్ని కొనసాగించారు. సికింద్రాబాద్లో మిల్కాసింగ్ పేరిట ఓ కాలనీతో పాటు స్టేడియం ఉన్నాయి. ఆ స్టేడియం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మిల్కాసింగ్ ‘అంతా ఇక్కడే మొదలైంది’ అని వ్యాఖ్యానించారు. ఆర్మీ ట్రెయినింగ్లో భాగంగా తొలిరోజుల్లో సికింద్రాబాద్లో రైల్వేట్రాక్ల వెంట పరుగులు తీసిన మిల్కా.. నాటి అనుభూతులను ఎన్నో సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు.