ముఖ్యమంత్రి కేసీఆర్కు టీఎన్జీవోల ధన్యవాదాలు
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతనాల పెంపు
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఆశాలు, అంగన్వాడీ, హోంగార్డు, సెర్ప్, విద్యా వలంటీర్లు, వీఆర్వో, వీఆర్ఏ, ఎయిడెడ్ ఉద్యోగులందరికీ లబ్ధి
180 రోజుల ప్రసూతి సెలవులపై మహిళా ఉద్యోగుల సంబురం
ఇది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటూ హర్షం
జనగామ, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వేతనాల పెంపు జీవోల విడుదలకు మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేయడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం,చేస్తున్నారు. పెరిగిన వేతనాలు జూన్ నుంచి అమల్లోకి రానుండడంతో సంబురపడుతున్నారు. 30శాతం ఫిట్మెంట్, ఉద్యోగ విరమణ వయస్సు 61ఏళ్లకు పెంపు, పీఆర్సీ 12నెలల బకాయిల చెల్లింపు నిర్ణయంపై అన్నివర్గాల ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో సంతోషం వెల్లివిరుస్తున్నది. సమైక్య రాష్ట్రంలో పనికి తగిన వేతనాలు లేకుండా వైద్యశాఖలో వెట్టిచాకిరీ చేస్తున్న ఆశ వర్కర్లకు తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడోసారి వారికి భారీగా వేతనాలు పెంచి వారి జీవితాల్లో భరోసా నింపింది.
ఇక పశుసంవర్ధకశాఖలో పనిచేస్తున్న చిరు ఉద్యోగులైన గోపాలమిత్రల వేతనాల రెట్టింపుతో వారి ముఖాల్లో వెలుగులు నిండాయి. అదేవిధంగా వైద్యశాఖలోని జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్(ఎన్యూహెచ్ఎం) కింద పనిచేస్తున్న డాక్టర్లు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, అటెండర్లు.. ఇలా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారికి కూడా వేతనాలు పెంచింది. ఇప్పటికే విద్యుత్శాఖ ఉద్యోగులకు 35శాతం పీఆర్సీ ప్రకటించిన సీఎం కేసీఆర్.. తాజా నిర్ణయంతో ప్రభుత్వశాఖల్లోని చిరుద్యోగులకూ భారీగా వేతనాలు పెరుగనున్నాయి. పీఆర్సీ కమిటీ సూచనల మేరకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) నూతన విధివిధానాలను నిర్ణయించేందుకు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో స్టీరింగ్ కమిటీ వేయడం, సీపీఎస్ కింద పనిచేస్తూ మరణించే ఉద్యోగి కుటుంబాలకు మేలు చేసేలా చేసిన ప్రకటనపై కూడా హర్షం వ్యక్తమవుతున్నది. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 15శాతం ఇచ్చే అదనపు పెన్షన్కు ఉన్న వయో పరిమితిని 75ఏళ్ల నుంచి 70ఏళ్లకు తగ్గిస్తూ చేసిన నిర్ణయానికి ఆమోదం తెలుపడంపై పెన్షనర్లు కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
హెడ్మాస్టర్లకు స్కూల్ అసిస్టెంట్ సమానస్థాయి పోస్టుల మంజూరు, భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు అంతర్ జిల్లా బదిలీలు, కేజీబీవీ మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180రోజుల ప్రసూతి సెలవుల సౌకర్యంపై మహిళ ఉద్యోగులు సంబురపడుతున్నారు. విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్ (కంట్రీబ్యూటరీ పెన్షన స్కీం) ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని వర్తింపజేయడం సహా ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ గ్రాట్యుటీ రూ.12లక్షల నుంచి రూ.16లక్షలకు పెంపు వంటి నిర్ణయాలు అన్నివర్గాల ఉద్యోగుల్లో అనందం నింపుతున్నాయి. గతంలోనే ఆశవర్కర్ల గౌరవ వేతనం రూ.6వేల నుంచి రూ.7,500, గోపాలమిత్రలకు రూ.3,500 నుంచి రూ.8,500కు, రెండో ఏఎన్ఎంలకు రూ.11వేల నుంచి ఏకంగా 100శాతం వేతనం పెంచి రూ.21,000కు, కాంట్రాక్టు డాక్టర్లకు రూ.36వేల నుంచి రూ.40వేలకు పెంచారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరికి కూడా 30శాతం అదనంగా వేతనాలు పెరుగుతుండడంతో ఆయా వర్గాల ఉద్యోగుల ఆనందానికి పట్టపగ్గాలులేవు. ఇప్పటికే ఆలయాల్లో పనిచేసే అర్చకుల వయోపరిమితి సైతం 58 ఏండ్ల నుంచి 65ఏండ్లకు పెంచారు. కోరుకున్న దానికంటే భారీగా జీతాలు పెరుగుతుండడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షపాతి
సీఎం కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షపాతి. 30శాతం ఫిట్మెంట్తో కూడిన పీఆర్సీని అసెంబ్లీలో ప్రకటించి, ఇచ్చిన హామీ మేరకు మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రికి కృతజతలు.
రేగూరి సుభాకర్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు,
జయశంకర్ భూపాలపల్లి