మంచిర్యాలటౌన్, మే 11: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఇంటింటా జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి ఎన్టీఆర్నగర్లో జరుగుతున్న జ్వర సర్వేలో పాల్గొని వైద్య సిబ్బందితో కలిసి వివరాలు సేకరించారు. ఇంటింటికీ తిరుగుతూ వారి ఆరోగ్య వివరాలు అడిగి నమో దు చేసుకున్నారు. 16వ వార్డు అశోక్రోడ్లో వార్డు కౌన్సిలర్ బోరిగం శ్రీనివాస్ వైద్యసిబ్బంది నిర్వహించే ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు. ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బందులు పడితే వైద్య సిబ్బందికి తెలపాలని, ముఖ్యంగా కరోనా లక్షణాలు కనబడితే వెంటనే దవాఖానకు వెళ్లి పరీక్ష చేయించుకుని ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐసొలేషన్ సెంటర్కు వెళ్లి చికిత్స పొందాలని సూచించారు. కమిషనర్ స్వరూపారాణి మాట్లాడుతూ.. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తే మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని పేర్కొన్నారు. తరచూ శానిటైజర్ను పూసుకోవడం గానీ, చేతులను సబ్బుతో కడుక్కోవడం గానీ చేయాలని సూచించారు.
కన్నెపల్లి, భీమిని మండలాల్లో..
కన్నెపల్లి, భీమిని మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఇంటింటా జ్వర సర్వే కొనసాగుతున్నది. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది మంగళవారం ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారి వివరాలను నమోదు చేసుకున్నారు. కన్నెపల్లి మండలంలోని ముత్తాపూర్ గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో కరోనాతో ముగ్గురు మృతిచెందడంతో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పంచాయతీ సిబ్బంది పిచికారీ చేశారు. సర్పంచ్ సుంకరి తిరుపతి ఆధ్వర్యం లో ఏఎన్ఎంలు అరుణాబాయి, శ్రీలత, ఆశ కార్యకర్త, వీఆర్ఏలు కలిసి ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేశారు. జ్వరంతో ఉన్న వారికి మెడికల్ కిట్లను పంపిణీ చేశారు.