న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, స్థూల దేశీయ ఉత్పత్తి (GDP)కి కొత్త భాష్యం చెప్పారు. GDP అంటే..’గ్యాస్-డీజిల్-పెట్రోల్’ అని వ్యాఖ్యానించారు. GDP పెరుగుతోందని కేంద్రం అంటున్నదని, అయితే ‘గ్యాస్-డీజిల్-పెట్రోల్’ ధరలు పెరుగుతుండటం దీని భావమని విమర్శించారు. ‘జీడీపీ పెరుగుతోందని మోడీ జీ చెబుతూ ఉన్నారు. జీడీపీ పైకి ప్రొజెక్షన్ చూపుతోందని ఆర్థిక మంత్రి చెప్పారు. GDP అంటే దాని అర్థం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. దీని అర్థం ‘గ్యాస్-డీజిల్-పెట్రోల్’. వారికి ఈ గందరగోళం ఉంది’ అని ఎద్దేవా చేశారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను రోజు రోజుకు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. 2014లో యూపీయే అధికారం కోల్పోయినప్పుడు ఎల్పీజీ సిలిండర్ ధర రూ .410 ఉండగా ప్రస్తుతం ఇది రూ.885కు చేరిందన్నారు. గ్యాస్ ధర సిలిండర్కు 116 శాతం పెరిగిందని ఆరోపించారు. అలాగే 2014లో పెట్రోల్ ధర లీటర్కు రూ.71.5 ఉండగా నేడు రూ.101కి ఎగబాకిందన్నారు. బీజేపీ పాలనలో లీటర్ పెట్రోల్ ధర 42 శాతం పెరిగిందని మండిపడ్డారు. ఇక 2014లో డీజిల్ ధర రూ.57 ఉండగా నేడు రూ.88కి చేరిందన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్న వాదనపై రాహుల్ మండిపడ్డారు. 2014లో యూపీఏ ప్రభుత్వ కాలంలో ముడి చమురు ధర రూ.105 కాగా, నేడు అది రూ.71కు తగ్గిందన్నారు. ఈ ధరతో పోల్చితే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముడి చమురు ధర 32 శాతం ఎక్కువని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధర సిలిండర్కు రూ.880 కాగా నేడు రూ.653గా ఉందన్నారు. నాటి కంటే నేడు 26 శాతం తక్కువ ధరకే అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ లభిస్తున్నదని చెప్పారు. గ్యాస్-డీజీల్-పెట్రోల్ (జీడీపీ) ద్వారా మోదీ ప్రభుత్వం రూ.23 లక్షల కోట్లు సంపాదించిందని రాహుల్ గాంధీ తెలిపారు. అయితే ఈ రూ.23 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు.
ఒక వైపు నోట్ల రద్దు, మరోవైపు మానిటైజేషన్.. గత ఏడేండ్లలో కొత్త ఆర్థిక నమూనాను చూశామంటూ రాహుల్ ఎద్దేవా చేశారు.‘డీమానిటైజేషన్ చేస్తున్నానని మొదట మోడీజీ చెప్పారు. ప్రస్తుతం మానిటైజేషన్ చేపడుతున్నట్లు ఆర్థిక మంత్రి అంటున్నారు. డబ్బు ఆర్జించడం అంటే ఏమిటి? మరి డీమానిటైజేషన్ ఎందుకు చేశారు? అని ప్రజలు అడుగుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
రైతులు, కార్మికులు, చిన్న-మధ్య తరహా వ్యాపారులు, MSMEలు, జీతభత్యాలపై ఆధారపడేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, నిజాయితీగల పారిశ్రామికవేత్తలు డీమానిటైజ్ బాధితులని రాహుల్ ఆరోపించారు. ‘డబ్బు ఎవరు ఆర్జిస్తున్నారు? నరేంద్ర మోడీకి స్నేహితులైన 4-5 మంది. వారికి లబ్ధి కోసమే ఆర్థిక బదిలీ జరుగుతోంది’ అని మండిపడ్డారు.