న్యూఢిల్లీ, జూన్ 6: పని ప్రదేశాల్లో మలయాళంలో మాట్లాడొద్దని ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గోవింద బల్లభ్ పంత్ (జీబీ పంత్) దవాఖాన తమ నర్సులకు హుకుం జారీ చేసింది. హిందీ లేదా ఇంగ్లిష్లోనే మాట్లాడాలని ఆదేశించింది. మలయాళంలో మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే దీనిపై మలయాళీ ఉద్యోగులతోపాటు ఇతర నర్సులూ ఆందోళనకు దిగారు. విధులకు రాకుండా నిరసన తెలిపారు. ఈ ఉత్తర్వులపై కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, శశి థరూర్ కూడా సామాజిక మాధ్యమాల వేదికగా అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో దిగొచ్చిన యాజమాన్యం ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. తమకు తెలియకుండానే సర్క్యులర్ జారీ అయిందని, దీని మీద విచారణ చేపడతామని జీబీ పంత్ దవాఖాన మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ దవాఖానలో సుమారు 850 మంది నర్సులుండగా.. వీరిలో 400 మంది మలయాళీ నర్సులే.