హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): బెంచీక్కొరు.. విస్తీర్ణాన్ని బట్టి తరగతి గదికి 15- 20 మంది. మాస్క్ తప్పనిసరి.. వీలైతే ఫేస్షీల్డ్ ధరించొచ్చు. ఇవి ప్రత్యక్షబోధనకు విద్యాశాఖ తయారుచేస్తున్న మార్గదర్శకాల్లో కొన్ని. ఇవేకాకుండా భౌతికదూరం పాటించడం, శానిటైజర్లు వినియోగించడం, థర్మల్ స్క్రీనింగ్, సబ్బులు, హ్యాండ్వాష్లు అందుబాటులో ఉంచడం సైతం మార్గదర్శకాల్లో ఉండనున్నాయని తెలుస్తున్నది. జూలై 1 నుంచి విద్యాసంస్థల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. మంత్రిమండలి ఆదేశం మేరకు విద్యాశాఖ అధికారులు కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. పూర్తిస్థాయి మార్గదర్శకాలను సోమవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి సమర్పించనున్నారు. ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్లైన్ క్లాసులను కొనసాగించనున్నారు. ఈ రెండింటి బోధన నేపథ్యంలో గందరగోళానికి తావులేకుండా పలు జాగ్రత్తలు తీసుకోనున్నారు.