నల్లగొండ : అరవై ఏండ్ల పాలనలో తెలంగాణను కాంగ్రెస్ నాయకులు నాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్ట అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తుందన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు రూ. 200 ఇస్తే.. తాము ఆసరా పెన్షన్ల కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ. 2016 ఇస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో రైతుబంధు, రైతుబీమా వస్తలేదా, కల్యాణలక్ష్మి వస్తలేదా. గతంలో ఇవన్నీ ఉండేనా. గతంలో రైతు చనిపోతే పరిహారం ఇచ్చే విషయంలో కూడా దారుణాలు చేసేవారు. ఇప్పుడు గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా.. రైతు బీమా కింద రూ. 5 లక్షలు ఇస్తున్నాం. ఏ పైరవీ లేకుండా ధరణి పోర్టల్లో భూముల రిజిస్ర్టేషన్ చకచకా జరిగిపోతోంది. ధరణి పోర్టల్తో చరిత్ర సృష్టించామన్నారు. ఫ్లోరైడ్తో బాధపడుతున్న ఈ జిల్లాకు మిషన్ భగీరథ నీళ్లు తీసుకొచ్చాం.
ఏమాయేనే నల్లగొండ.. ఏడుపే నీ గుండె నిండా అని నేనే పాట రాశాను. ఈ 30 ఏండ్ల చరిత్రలో జానారెడ్డి ఏం చేయలేదు. కృష్ణా నది ఒడ్డున ఉన్న గ్రామాలకు కూడా గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వలేదు. ఇవాళ మిషన్ భగీరథ ద్వారా వచ్చే నల్లా నీళ్లలో మీకు కేసీఆర్ కనబడుత లేడా. 60 ఏండ్ల పాలనలో తెలంగాణను కాంగ్రెస్ నాయకులు నాశనం చేశారు. ఇప్పుడు కరెంటు సమస్య లేదు. రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ను ఇస్తున్నాం. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.