ఇంద్రవెల్లి, ఏప్రిల్19:1981 ఏప్రిల్ 20.. హక్కుల కోసం అడవిబిడ్డలంతా ఒక్కటై చీమలదండులా ఇంద్రవెల్లి బాట పట్టారు. పోలీసుల ఆంక్షలు, హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు. చిన్నపాటి ఘర్షణలో ఓ జవాను మృతి చెందగా, ఒక్కసారిగా రెచ్చిపోయిన ఖాకీలు గుళ్ల వర్షం కురిపించారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 13 మంది పిట్టల్లా (అనధికారికంగా 60 మంది) రాలిపోయారు. నేటితో సరిగ్గా 40 ఏళ్లు పూర్తవుతుండగా, ఆ గాయాలు ఇంకా ఆదివాసులను వెంటాడుతూనే ఉన్నాయి. నేడు పోరుగడ్డలో సంస్మరణ సభ నిర్వహించనుండగా, ఆనాటి అమరులకు నివాళులర్పించేందుకు ఆదివాసులు సిద్ధమయ్యారు.
ఇంద్రవెల్లి, ఏప్రిల్19 : అమాయక గిరిజనుల నెత్తురు చిందిన ఇంద్రవెల్లి ఘటనకు నేటితో 40 ఏళ్లు పూర్తయ్యాయి. 1981, ఏప్రిల్ 20న జరిగిన ఘటనను ఇక్కడి ఆదివాసీ గిరిజనులు ఎన్నటికీ మరువలేరు. స్వరాష్ట్రంలో పోలీసులు ఆంక్షలు సడలింపు చేయడంతో ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహిస్తూ అమరవీరులకు స్వేచ్ఛగా నివాళులర్పించి శ్రద్ధంజలి ఘటిస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల ఆంక్షలతో కూడిన అనుమతి లభించడంతో అమరవీరుల స్తూపం వద్ద స్వేచ్ఛగా నివాళులర్పించేందుకు ఆదివాసీ గిరిజనులు అన్ని విధాలా సిద్ధమయ్యారు. అమరవీరుల స్తూపం వద్ద పోలీసులు విధిస్తున్న 144 సెక్షన్ను సడలిస్తూ అమరులకు నివాళులర్పించేందుకు 50 మందికి అనుమతి ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సడలింపు చేశారు.
ఆ రోజు జరిగింది ఇది..
హక్కులు కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ గురిపెట్టి తూటల వర్షం కురిపించింది. అప్పటి ప్రభుత్వ హయాంలోని పోలీసులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో అనేక మంది గిరిపుత్రులు అసువులుబాశారు. ఈ ఘటనతో ఇంద్రవెల్లి పేరు దేశంలోనే మార్మోగిపోయింది. 40 ఏళ్ల క్రితం గిరిజనులు, వ్యాపారులు అధికారుల చేతుల్లో అనేక రకాలుగా దోపిడీకి గురయ్యారు. గిరిజనులు నోరువిప్పితే చాలు అధికారులు చావబాదేవారు. ఈ క్రమంలో నక్సలైట్ల ఉద్యమం విస్తరిస్తోంది. వారిని అణచివేయడానికి గిరిజన గూడేల్లో పోలీసుల బూట్ల చప్పుళ్లు ప్రారంభమయ్యాయి. అష్టకష్టాలు పడుతున్న గిరిజనులెవరూ పోరాటం చేసినా కలిసిరావడానికి సన్నద్ధమయ్యారు. ఈ తరుణంలో నక్సలైట్లు భూ పంపిణీ చేయాలని ప్రభుత్వంపై ఒ త్తిడి తెచ్చారు. మరోవైపు గిరిజన సం ఘాలు కూడా ఈ సమస్యలపై ఆందోళనలు ప్రారంభించారు. ఈ క్రమం లో గిరిజనులు అడవుల్లో ఖాళీగా ఉన్న భూములను దున్నడం ప్రారంభించారు. అయినా అప్పటి ప్రభుత్వం స్పందించకపోవడంతో పలు సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి 1981, ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినా వెనక్కి తీసుకొనే ప్రసక్తి లేదని గిరిజన సంఘాలు ప్రకటించాయి.
చేదు స్మృతులు..
1981, ఏప్రిల్ 20న నాలుగు దిక్కుల నుంచి చిన్నాపెద్దా తేడాలేకుండా గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రవెల్లి అంతా గిరిజనులతో నిండిపోయింది. సమావేశం జరుగకుండా అప్పటి పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. వాహనాలు రాకుండా రహదారులను దిగ్బంధించారు. వేలాది గిరిజనుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ జవాన్ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రాణంకంటే శీలం ముఖ్యమనుకున్న ఆ యువతి జవాన్పై చేతిలో ఉన్న ఆయుధంతో దాడి చేసింది. అంతే ఆ జవాన్ నేలకొరిగాడు. దీంతో పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు తుపాకులకు పని చెప్పారు. 13 మంది గిరిజనులు మృతిచెందారని, అనేక మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. కానీ 60 మందికి పైగా చనిపోయారని, వందలాది మందిగాయపడ్డారని నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. కాగా, కాల్పుల్లో గాయపడ్డ వారిలో కొంతమంది ఇప్పటికీ బతికే ఉన్నారు.
1987లో స్తూపం పునర్మిర్మాణం
1981, ఏప్రిల్ 20న కాల్పుల్లో మరణించిన గిరిజనుల స్మారకార్థం రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో స్తూపాన్ని నిర్మించారు. కానీ 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్తూపాన్ని డైనమైట్లతో కూల్చివేశారు. దీంతో అమరవీరుల స్తూపం నేలమట్టమైపోవడంతో గిరిజనుల్లో నెలకొన్న నిరాశ నిస్పృహలను తొలగించేందుకు అప్పటి ప్రభుత్వం 1987లో ప్రభుత్వ నిధులతో స్మారక స్తూపాన్ని పునర్నించింది.