న్యూఢిల్లీ: ఒంట్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మ్యూకోమైకోసిస్, క్యాండిడా, ఆస్పోరోజెనస్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా చెప్పారు. ఈ మూడు రకాల ఫంగస్లు ప్రధానంగా సైనసెస్, ముక్కు, కంటి చుట్టూ ఉన్న ఎముకలో కనిపిస్తుందని, ఇవి బ్రెయిన్లోకి కూడా ప్రవేశించగలవని ఆయన తెలిపారు.
శరీరంలోని ఒక్కో భాగంలో ఫంగస్ ఒక్కో రంగులో కనిపిస్తుందని గులేరియా చెప్పారు. అయితే ఫంగస్ ఇన్ఫెక్షన్ అంటువ్యాధి కాదని ఆయన స్పష్టంచేశారు. కొవిడ్ వచ్చి తగ్గిన బాధితుల్లో కొన్ని పోస్ట్ కొవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. కొవిడ్ తగ్గిన తర్వాత 4 నుంచి 12 వారాలపాటు సింప్టమ్స్ కనిపిస్తే దాన్ని ఆన్గోయింగ్ సింప్టమాటిక్ కొవిడ్ లేదా పోస్ట్ అక్యూట్ కొవిడ్ సిండ్రోమ్ అంటారని చెప్పారు.
ఒకవేళ 12 వారాల తర్వాత కూడా సింప్టమ్స్ కనిపిస్తే దాన్ని పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ అంటారని రణ్దీప్ గులేరియా తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు కరోనా సంక్రమిస్తుందని నిరూపించే ఎలాంటి డాటా అందుబాటులో లేదని ఆయన చెప్పారు. అయితే మనుషుల నుంచి జంతువులకు వైరస్ సంక్రమిస్తుందనడానికి మాత్రం డాటా అందుబాటులో ఉందన్నారు. ఫస్ట్వేవ్ సందర్భంగా న్యూయార్క్ జూలో సిబ్బంది నుంచి జంతువులకు కరోనా సోకిందని తెలిపారు.