హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల జరిగిన రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. వీటితో పాటు పలు మున్సిపాలిటీల్లో జరిగిన వార్డులకు సైతం ఎన్నికలు జరగ్గా.. ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా కొవిడ్ నిబంధనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ఓట్లను నగర శివారులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో లెక్కించనున్నారు. 66 డివిజన్లను మూడు బ్లాకులుగా చేసి, లెక్కించనున్నారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడికానున్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి.. పోలింగ్ కేంద్రాల వారిగా.. బ్యాలెట్ పెట్టెల్లోని ఓట్లు లెక్కిస్తారు. మూడు నుంచి నాలుగు రౌండ్లలో లెక్కింపు జరుగనుంది. అచ్చంపేట మున్సిపల్ లెక్కింపు.. జేఎంజే ఉన్నత పాఠశాలలో చేపట్టనున్నారు.
ఖమ్మం నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపు ఎస్ఆర్ అండ్బీజీఎన్ఆర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. 60 డివిజన్లలో పదో డివిజన్ ఏకగ్రీవమైంది. మిగతా 59 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. లెక్కింపు కోసం ప్రతి డివిజన్కు ఓ కౌంటింగ్ అధికారిని నియమించారు. 59 మంది ఆర్వోలు, ప్రతి టేబుల్కు ఓ సూపర్ వైజర్ను నియమించారు. ఓట్ల లెక్కింపు కోసం 10 హాళ్లు ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీల్లోనూ కౌంటింగ్ సాగనుంది. జడ్చర్ల బల్దియా ఓట్ల లెక్కింపు బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగనుండగా.. 27 వార్డులకు 112 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కొత్తూరు బల్దియా ఓట్లను కేజీబీవీ పాఠశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. మూడు రౌండ్లలో కొత్తూరు ఫలితాలు రానున్నాయి.
తొలిసారి ఎన్నికలు జరిగిన నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ 20 వార్డుల్లో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే సిద్దిపేట మున్సిపాలిటీలో 43వార్డులకు 236 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. 43 వార్డులకు 263 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదటి రౌండ్లో 1-21 ఓట్లను లెక్కిస్తుండగా.. రెండో రౌండ్లో 22-43 వార్డుల ఓట్లను లెక్కించనున్నారు. జీహెచ్ఎంసీలోని లింగోజీగూడ డివిజన్ ఉప ఎన్నిక ఓట లెక్కింపు సరూర్నగర్ వీఎం హాలులో నిర్వహిస్తున్నారు. నల్గొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్, మెట్పల్లి, జల్పల్లి, గజ్వేల్ మున్సిపాలిటీల్లోని ఒక్కొక్క వార్డుకు ఎన్నికలు జరగ్గా.. ఫలితాలు వెలువడనున్నాయి.