ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్నారు..
కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు భేష్
కొవిడ్ మార్గదర్శకాలు అందరూ పాటించాలి..
అనవసరంగా బయటకు రావద్దు
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
అక్షయపాత్ర, ఐకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ
నిర్మల్ అర్బన్, జూన్ 1 : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పారిశుధ్య కార్మికులు, ఆశ కార్యకర్తలు చేస్తున్న కృషి మరువలేనిదని రాష్ట్ర అటవీ, పర్యారణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో అక్షయ పాత్ర, ఐకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, ఆశ వర్కర్లకు రూ.1000 విలువ చేసే 10 రకాల నిత్యావసర సరుకులను మంగళవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా వైరస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు,ఆశ వర్కర్లు, పోలీసులు ఇతర ఫ్రంట్లైన్ వారియర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారని, వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ తమవంతు సహకారంగా నిత్యావసరాలు అందించడం అభినందనీయమన్నారు. జిల్లాలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని, పాజిటివ్ కేసులు కూడా తక్కువగా ఉన్నాయని సీఎం కేసీఆర్ అభినందించారని మంత్రి తెలిపారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించి కరోనాను కట్టడి చేయాల్సిన ప్రధాని మోదీ విదేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేశారని, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించా లని, వైరస్ నియంత్రణకు అడ్డుకట్ట వేయాల న్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, రైతు బంధ సమితి జిల్లా అధ్యక్షుడు నల్ల వెంకట్ రాం రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, అల్లోల సురేందర్ రెడ్డి, అల్లోల మురళీధర్ రెడ్డి, టీఆర్ఎస్ యువనాయకులు అల్లో గౌతం రెడ్డి, అల్లోల దివ్యారెడ్డి, కౌన్సిలర్లు అయ్యన్నగారి రాజేందర్, సంపంగి రవి, గండ్రత్ రమణ, బిట్లింగ్ నవీన్, నేరెళ్ల వేణు,పోశెట్టి, నాయకులు అడ్ప పోశెట్టి, మేడారం ప్రదీప్, అప్పాల వంశీ, డీ శ్రీనివాస్,రిజ్వాన్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ ఉన్నారు.