చండీఘడ్: పంజాబ్ డిప్యూటీ సీఎంగా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూను నియమించే అవకాశాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర సీఎం అమరీంద్ సింగ్ ఈ అంశంలో ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టాలని అమరీందర్ ఆలోచిస్తున్నారు. ఇదే విషయాన్ని చర్చించేందుకు ఇవాళ ఇద్దరు నేతలు భేటీకానున్నారు. గత ఏడాది నవంబర్లో సిద్దూ, అమరీందర్ మధ్య చర్చలు జరిగాయి. అయితే పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సిద్దూకు డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాలని అమరీందర్ భావిస్తున్నట్లు కొన్ని వర్గాల ద్వారా స్పష్టమైంది. పంజాబ్ ఎన్నికల్లో సిద్దూ కీలక ప్రచారకర్తగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి.