న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరాయి. ఫ్రాన్స్లోని ఇస్రెస్ ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం టేకాఫ్ అయ్యి ఏక ధాటిగా 7 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ మూడు రాఫెల్స్ సాయంత్రానికి దేశంలో ల్యాండ్ అయినట్లు భారత వాయు సేన తెలిపింది. మార్గమధ్యలో గాలిలోనే విమాన ట్యాంకర్ల ద్వారా ఇంధనం నింపి సహకరించిన యూఏఈకి ధన్యవాదాలు తెలిపింది. తాజాగా ఏడో సెట్ కింద మూడు రాఫెల్స్ రాకతో ఇప్పటి వరకు భారత్కు అందిన రాఫెల్స్ యుద్ధ విమానాల సంఖ్య 28కి చేరింది. ఈ నేపథ్యంలో ఈ నెల చివరలో పశ్చిమ బెంగాల్ ఎయిర్బేస్లో రెండో రాఫెల్ స్క్వాడ్రన్ అందుబాటులోకి రానున్నది.
అత్యాధునిక 36 రాఫెల్ యుద్ధ విమానాలను రూ.59,000 కోట్లతో కొనుగోలుకు ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థతో మోదీ ప్రభుత్వం 2016లో ఒప్పందం చేసుకున్నది. గత ఏడాది జూలై 29న తొలి విడతగా ఐదు రాఫెల్స్ భారత్కు చేరాయి. తాజాగా మరో మూడు రాఫెల్స్ రాకతో వీటి సంఖ్య 28కి చేరింది. ఈ ఏడాది చివరి నాటికి 36 విమానాల సరఫరా పూర్తి కానున్నది.