బెంగుళూరు: స్వాతంత్య్ర సమరయోధుడు.. 103 ఏళ్ల వృద్ధుడు హెచ్ఎస్ దొరేస్వామి ఇవాళ కన్నుమూశారు. బెంగుళూరు హాస్పిటల్లో ఆయన గుండెపోటుతో మరణించినట్లు సన్నిహితులు తెలిపారు. 103 ఏళ్ల దొరేస్వామి.. మే 13వ తేదీన కరోనా వైరస్ను జయించారు. భావ స్వేచ్ఛ కోసం పోరాడిన కన్నడ యోధుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. బెంగుళూరులోని జయదేవ్ హాస్పిటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. 1918, ఏప్రిల్ 10వ తేదీన బెంగుళూరులోని హరోహల్లిలో ఆయన జన్మించారు. యుక్తవయసులోనే ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. తొలుత విప్లవ బాటలో సాగిన.. ఆ తర్వాత గాంధీ దారిలో నడిచారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన మైసూర్ సామ్రాజ్యంలో ఆందోళనలు నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1943 నుంచి 1944 మధ్య ఆయన 14 నెలల జైలు జీవితం అనుభవించారు. పౌరవాని అనే పత్రికను ఆయన నడిపారు.