న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ విధానంలో చేసిన మార్పులకు అనుగుణంగా సోమవారం నుంచి 18 ఏండ్లు దాటిన అందరికీ కరోనా టీకా ఉచితంగా లభించనున్నది. ఉత్పత్తిదారుల నుంచి 75 శాతం వ్యాక్సిన్లను కేంద్రమే కొని రాష్ర్టాలకు ఉచితంగా ఇస్తుందని ఈ నెల మొదట్లో ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 18 ఏండ్లు దాటిన అందరికీ ఉచిత వ్యాక్సిన్ లభిస్తుందని తెలిపారు. అంతకుముందు వరకు 18 నుంచి 45 ఏండ్ల వయసు వారి కోసం వ్యాక్సిన్లను సమకూర్చుకునే బాధ్యత రాష్ర్టాలదేనని కేంద్రం చెబుతూ వచ్చింది. అయితే అనేక విమర్శలు, సుప్రీంకోర్టు తప్పుపట్టడంతో కేంద్రం తన విధానాన్ని మార్చుకున్నది.
తిరిగి కేంద్రీకృతం..
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైంది. అప్పటి నుంచి ఏప్రిల్ 30 వరకు తయారీదారుల నుంచి 100 శాతం వ్యాక్సిన్ డోసులను కేంద్రమే కొనుగోలు చేసి, రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేసింది. ఆ దశలో ఫ్రంట్లైన్ వర్కర్లకు, 45 ఏండ్లు దాటిన వారికి టీకా వేశారు. మే 1 నుంచి కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు 50 శాతం టీకాలను కేంద్రానికి విక్రయించాలని, రాష్ర్టాలకు, ప్రైవేటు దవాఖానలకు చెరో 25 శాతం అమ్మాలని నిర్దేశించింది. టీకా ధరలు నిర్ణయించిన విధానం నిర్హేతుకంగా ఉందని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
ఏ రాష్ర్టానికి ఎన్ని?
జనాభా, కరోనా కేసులు, వ్యాక్సిన్లలో వృథా వంటి అంశాల ఆధారంగా రాష్ర్టాలకు సరఫరా చేయాల్సిన టీకా డోసులను కేంద్రం నిర్ణయిస్తుంది.
ప్రైవేటు దవాఖానలకు 25శాతం
ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లలో 25 శాతాన్ని ప్రైవేటు దవాఖానలు కొనుగోలు చేయవచ్చు. టీకా వేసినందుకు అవి రుసుము తీసుకోవచ్చు. గరిష్ఠంగా ఎంత తీసుకోవాలో కేంద్రం ఖరారు చేసింది.
కొవిన్లో నమోదు తప్పనిసరి కాదు
సోమవారం నుంచి టీకా వేయించుకునేందుకు కొవిన్ పోర్టల్లో ముందుగా నమోదు చేసుకోవడం తప్పనిసరి కాదు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఆన్సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించింది.
రాష్ర్టాలు ఏం చేయాలి?
కొత్త విధానంలో కేంద్రం అందజేసిన వ్యాక్సిన్ డోసులను రాష్ర్టాలు 18 ఏండ్లు దాటిన వారికి వేస్తాయి. వీరిలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లు, 45 ఏండ్ల వయసు పౌరులు, వీరి తర్వాత రెండో డోసు వేయించుకోవాల్సిన వారు ప్రాధాన్య వర్గంగా ఉంటారు. వీరి తర్వాత 18 ఏండ్లు దాటిన వ్యక్తులు వస్తారు. వీరిలో ప్రాధాన్యతా క్రమాన్ని వ్యాక్సిన్ సరఫరా షెడ్యూల్ ప్రకారం రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయని కేంద్రం పేర్కొంది.