మహబూబ్నగర్ : జంతువులను వేటాడే చిరుత పరాజయం పాలైంది. బర్రెలపై దాడికి యత్నించిన చిరుతపైనే అవి తిరిగి ఎదురుదాడికి దిగాయి. దీంతో చిరుత గాయాలపాలైంది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం బూర్గుపల్లి సమీపంలో చోటు చేసుకుంది.
బూర్గుపల్లి సమీపంలో ఓ పశువుల కొట్టంలోకి చిరుత నిన్న రాత్రి ప్రవేశించింది. అక్కడున్న బర్రెలపై దాడికి చిరుత యత్నించింది.
ఈ క్రమంలో బర్రెలు ఏ మాత్రం బెదరకుండా.. చిరుతపై ఎదురుదాడి చేశాయి. దీంతో చిరుత ముందరి కాళ్లతో పాటు నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. చిరుత లేచి నడవలేని పరిస్థితిలో ఉండిపోయింది.
ఈ ఉదయం చిరుతను గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. చిరుతను హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్కు అధికారులు తరలించారు. నడవలేని స్థితిలో ఉన్న చిరుత దగ్గరకు స్థానికులు వెళ్లి వీడియోలు చిత్రీకరించారు. స్థానికులను చూసిన చిరుత గాండ్రిపులు చేసింది.