జూబ్లీహిల్స్ : భూగర్భ జలాలు పెంపొందించి భవిష్యత్ తరాలకు భరోసానిచ్చేందుకు జలమండలి అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వరదనీరు వృథాగా పోకుండా జల సంరక్షణతో.. జన సంరక్షణ.. నినాదంతో వర్షం నీటిని ఒడిసిపట్టనున్నారు. వర్షంనీరు వృథాకాకుండా భూగర్భంలోకి మళ్లించేందుకు ఇంకుడు గుంతలను పునరుద్ధరించనున్నారు. వర్షాలకు సమృద్ధిగా ప్రవహించే వరదనీరు డ్రైనేజీలు, కాలువల్లో కలిసిపోతూ నిరుపయోగంగా మారుతోంది. ఈ నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించి భూగర్భ జలమట్టాలు పెంపొందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వాటర్ హార్వెస్టింగ్ పిట్ షురూ..
వాన నీటి సంరక్షణకు జలమండలి గతంలో ఏర్పా టు చేసిన ఇంకుడు గుంతలను వినియోగంలోకి తెస్తున్నారు. ప్రపంచ నీటి దినోత్సవ వారోత్సవాలు పురస్కరించుకుని వెంగళరావునగర్ డివిజన్లో పునరుద్ధరించిన వాటర్ హార్వెస్టింగ్ పిట్లను మంగళవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డివిజన్-6 జనరల్ మేనేజర్ హరిశంకర్తో కలిసి ప్రారంభించారు. ఇందులో భాగంగా జలమండలి అధికారులు గతంలో ఏర్పాటు చేసిన 164 ఇంకుడు గుంతలను పునరుద్ధరించే పనులు చేపడుతున్నారు.
ఎన్జీవోలతో కలిసి పునరుద్ధరణ
కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో కరువు ఏర్పడినా భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే నగరంలో 20-30 శాతం బోర్వెల్స్ ఎండిపోయాయని జలమండలి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నీటి దుర్వినియోగంతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చింది. దీంతో ప్రతి వర్షాకాలం ప్రహసనంగా మారిపోతున్న ఇంకుడు గుంతల నిర్వహణను పకడ్బందీగా చేపట్టేందుకు జలమండలి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి డివిజన్లో ఎన్జీవోల భాగస్వామ్యంతో ఇంకుడు గుంతల పునరుద్ధరణ పనులను చేపడుతున్నారు.
ఇంకుడు గంతల ఏర్పాటుకు సహకారం
ప్రతిఇంటితోపాటు అపార్ట్మెంట్ల వాసులు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. దానికి అవసరమైన సలహాలను, సూచలను జలమండలి సిబ్బందితో పాటు ఎన్జీవో సంస్థలు అందిస్తారు. ఇంటి విస్తీర్ణాన్ని బట్టి ఎంత స్థలంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలో ఎన్జీవోల ప్రతినిధులు సందర్శించి సంబంధిత యజమానులకు తెలియజేస్తారు. జలమండలి డివిజన్-6 ఆధ్వర్యంలో 200 ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే ఉన్న 164 గుంతలను పునరుద్ధరిస్తున్నాం.- హరిశంకర్, జలమండలి జీఎం