గౌహతి: అస్సాం, మిజోరం సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత నెలకొన్నది. మిజోరం వైపునకు కోడిగుడ్లతో వెళ్తున్న నాలుగు మినీ లారీలను అస్సాంలోని కాచర్ జిల్లా వాసులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. మిజోరం వైపు వెళ్లే వాహనాలను అడ్డుకోవద్దని అస్సాం ప్రభుత్వం పిలుపునిచ్చినప్పటికీ స్థానికులు లెక్క చేయలేదు. కరీంగంజ్ నుంచి గుడ్ల లోడుతో మిజోరం వెళ్తున్న నాలుగు లారీలను కాచర్ జిల్లాలోని భాఘా బజార్ వద్ద స్థానికులు అడ్డుకున్నారు. లారీలు ఎక్కడకు వెళ్తున్నాయని డ్రైవర్లను అడిగారు. మిజోరం వెళ్తున్నట్లు వారు చెప్పడంతో స్థానికులు ఆ వాహనాలను ధ్వంసం చేశారు. లారీల్లోని గుడ్లను రోడ్డుపైకి విసిరేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని నియంత్రించారు.
కాగా, జూలై 26న వివాదస్పద సరిహద్దు ప్రాంతం వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ నేపథ్యంలో మిజోరం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు, ఒక పౌరుడు మరణించగా 50 మందికిపైగా గాయపడ్డారు. జోక్యం చేసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివాదస్పద సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరు రాష్ట్రాల పోలీసులను వెనక్కి రప్పించాలని రెండు రాష్ట్రాల సీఎంలను ఆదేశించారు. పోలీసుల స్థానంలో అక్కడ కేంద్ర బలగాలను మోహరించారు.
మరోవైపు ఈ నెల 5న అస్సాం మంత్రులు ఐజ్వాల్కు వెళ్లి మిజోరం మంత్రులతో చర్చలు జరిపారు. ఏండ్ల నాటి సరిహద్దు వివాదాన్ని సామరస్య వాతావరణంలో పరిష్కరించుకుంటామని ఇరు ప్రభుత్వాలు వెల్లడించాయి. ఇది జరిగిన రెండు రోజుల్లోనే సరిహద్దు ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.