బెంగుళూరు: కర్నాటక లింగాయత్ మఠాధిపతి శివమూర్తి శరణారుపై తాజాగా కేసు నమోదు అయ్యింది. అత్యాచార ఆరోపణలపై ఆయన ఇప్పటికే జైలులో ఉన్నారు. తమను లైంగికంగా వేధించినట్లు నలుగురు మైనర్ బాలికలు ఆరోపించడంతో శరణారుపై కొత్త కేసు నమోదు అయ్యింది.
మురుగ మఠాధిపతి అయిన శరణారు.. 2019 జనవరి నుంచి 2022 జూన్ వరకు పలు మార్లు లైంగికంగా వేధించినట్లు ఆ నలుగురు అమ్మాయిలు ఆరోపించారు. లింగాయత్ నేతతో పాటు మరో ఆరు మందిపై కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మఠంలోని హాస్టల్ వార్డెన్పై కూడా కేసు బుక్ చేశారు.
పోక్సో చట్టం కింద శరణారుపై ఇప్పటి వరకు రెండు కేసులు నమోదు అయ్యాయి. లైంగికంగా వేధించినట్లు ఇద్దరు బాలికలు ఆరోపించడంతో సెప్టెంబర్లో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 26వ తేదీన నమోదు అయిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.