యాదాద్రి భువనగిరి : కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గురువారం భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా ఉధృతి నివారణకు చేపడుతున్న చర్యలు, కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందులు, ఆక్సిజన్ బెడ్లు, ఆక్సిజన్ సరఫరా అందుబాటులో ఉన్న తీరును జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్తో కలిసి మంత్రి వైద్య అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ కేసుల విషయములో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండి, మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఇంటి వద్ద హోమ్ ఇసోలేషన్ సౌకర్యంలేని వారిని కొవిడ్ కేర్ సెంటర్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఇంటింటి సర్వే ద్వారా గుర్తించిన కరోనా అనుమానితులకు హోమ్ ఇసొలేషన్ ద్వారా చికిత్స అందించాలని, వ్యాధి తీవ్రత ఉన్న వారిని అసుపత్రిలో చేర్పించి వైద్యం అందించాలని, వారికి మెడికల్ కిట్స్ అందించాలని మంత్రి అధికారులకు సూచించారు.
కరోనా ఉదృతిని అరికట్టడానికి ప్రభుత్వము లాక్డౌన్ విదించినందున సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో కోరోనా పరిస్థితులు..చేపట్టిన చర్యలతో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ఇంటింటా ఫీవర్ సర్వే సందర్బంగా తీసుకున్న చర్యలను కలెక్టర్ అనితా రామచంద్రన్ మంత్రికి వివరించారు. ఈ సమావేశములో స్ధానిక శాసన సభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు శ్రీనివాసరెడ్డి, కీమ్యా నాయక్, డీసీపీ నారాయణ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు, పలువురు వైద్యులు పాల్గొన్నారు.