న్యూఢిల్లీ: ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు ఫార్మా మేజర్లు అహర్నిశలు క్రుషి చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ ప్రత్యేకించి కరోనాను నియంత్రించడానికి అవసరమైన వ్యాక్సిన్ డెవలప్మెంట్పై బిలియన్ల డాలర్ల కొద్దీ పెట్టుబడులు కుమ్మరించాయి. సదరు టీకా వేయడానికి అవసరమైన సిరంజీలను తయారు చేయడంపై కేంద్రీకరించలేదు. బ్రెజిల్ గత జనవరిలోనే సిరంజీల ఎగుమతిపై నిషేధం విధించింది.
ఈ పరిస్థితుల్లోనే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సిరంజీల తయారీ సంస్థ హిందూస్థాన్ సిరంజీస్ అండ్ మెడికల్ డివైజెస్ సంస్థ ఈ-మెయిల్కు అత్యవసర మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ పంపింది ఎవరో కాదు.. ఐక్యరాజ్యసమితి బాలల సంక్షేమ సంస్థ యూనిసెఫ్ నుంచి.. భారీ స్థాయిలో సిరంజీలు కావాలని హిందూస్థాన్ సిరంజీస్ అండ్ మెడికల్ డివైజెస్ సంస్థకు ఆర్డర్ పెట్టింది. ఈ ఆర్డర్ మేరకు హిందూస్థాన్ సిరంజీస్ అండ్ మెడికల్ డివైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ నాథ్ తన ఉత్పాదక యూనిట్లలో భారీ స్థాయిలో సిరంజీల ఉత్పత్తికి సిద్ధం అయ్యారు.
ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తన ఉత్పాదక యూనిట్లలో నిమిషానికి 5,900 సిరంజీల తయారీకి శ్రీకారం చుట్టారు రాజీవ్ నాథ్. ఢిల్లీ నగర శివారుల్లో 11 ఎకరాల విస్తీర్ణంలోని పారిశ్రామిక యూనిట్లో సిరంజీల ఉత్పత్తి చేపట్టారు. అంతర్జాతీయ వైద్య నిపుణుల అంచనా ప్రకారం కొవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం 800 కోట్ల నుంచి 1000 కోట్ల సిరంజీలు అవసరం అని చెబుతున్నారు.
గతంలోనూ ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు యూనిసెఫ్ కార్యక్రమం కింద వ్యాక్సినేషన్కు అవసరమైన సిరంజీలను ఉత్పత్తి చేసిన చరిత్ర హిందూస్థాన్ సిరంజీస్కు ఉంది. సాధారణంగా ఏడాదిలో 250 కోట్ల సిరంజీలను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. కానీ ఈ ఏడాది వచ్చే జూలై నాటికి 300 కోట్ల సిరంజీల ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించింది.