మహబూబ్నగర్ : ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ, కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఏపీ తీరును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిప్పులు చెరిగారు. వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ నేతలది సైంధవ పాత్ర అన్నారు. హక్కు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాతరేస్తాం. దాదాగిరీ, గూండాగిరి నడవనివ్వం. ఇప్పుడు మాదొక రాష్ట్రం. మా హక్కులకు విరుద్దంగా కృష్ణా బేసిన్లో దోసెడు నీళ్లను కూడా తీసుకోనివ్వం. కృష్ణా నది నుండి తెలంగాణకు హక్కుగా వచ్చే ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంటాం. వెన్నెముకలేని బానిస నేతల మూలంగానే గతంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఏపీ జలదోపిడీని ఎట్టి పరిస్థితులలో అడ్డుకుని తీరుతాం. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తాం.
సమైక్యపాలనలో ఆంధ్రా జలదోపిడీకి మద్దతుగా హారతులు పట్టినోళ్లు, దొంగ ప్రాజెక్టులకు సద్దులు మోసిన ఇంటి దొంగలు ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని హాహాకారాలు చేస్తున్నరు. తెలంగాణ ఉద్యమమే నదీజలాలు, సాగునీటి హక్కుల కోసం. కృష్ణాజలాలలో తెలంగాణ నీటి వాటా తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులుగా మీరున్నారు. పాలితులుగా తెలంగాణ ప్రజలున్నారు. అప్పుడు ఇక్కడి నాయకత్వం మీకు పదవుల కోసం బానిసలుగా మారడంతో అక్రమ ప్రాజెక్టులను కట్టగలిగారు. అసలు ప్రాజెక్టులు కట్టుకునేందుకు ఏపీకి శాశ్వత నీటి కేటాయింపులు ఎక్కడివి ?
ఇప్పుడు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం .. ఆంధ్రా జలదోపిడీని అడ్డుకుంటాం .. ఈ దేశంలో రాజ్యాంగం అమలులో ఉందన్న విషయం ఏపీ ప్రభుత్వం గుర్తించాలి. నీటి కేటాయింపులు జరిగాక, అన్ని రకాల అనుమతులు వచ్చాకనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తాం అని ఏపీ ప్రభుత్వం రాతపూర్వకంగా రాసిచ్చారు. ఏపి ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ వ్యతిరేకం, చట్టవ్యతిరేకం, విభజన చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకం, సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకం. కేంద్రప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి .. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు నిర్ణీత కాలగడువు విధించి కృష్ణా జలాలలో తెలంగాణ, ఆంధ్రా నీటివాటాలు తేల్చాలి
వృధాగా పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్కు స్నేహ హస్తం అందించారు. కేసీఆర్ దూరదృష్టితో చేసిన సూచనలను వదిలేసి కృష్ణా జలాలను అన్యాయంగా తీసుకుపోతామనడం మిత్ర ద్రోహమే. రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి గర్హనీయం. ఆయా రాష్ట్రాల సహజ వనరులు సద్వినియోగం చేసుకునేందుకు కేంద్రం సమస్యలు పరిష్కరించి సహకరించాలి. ఒక ప్రాజెక్టు నిర్మాణంతో వచ్చే ఉత్పత్తి ఎంత? నీటి సంపద ఎంత? మత్స్యసంపద ఎంత? జీవవైవిధ్యం ఎంత? పశుసంపద ఎంత? మొత్తంగా వచ్చే సమాజ సంపద ఎంత? వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం వ్యవహరించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.