న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ గోవిందాస్ కొంతౌజమ్ ( Govindas Konthoujam ) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన కమలం కండువా కప్పుకున్నారు. మణిపూర్ సీఎం బీరేన్సింగ్, బీజేపీ సీనియర్ నాయకుడు సంబిట్ పాట్రా సమక్షంలో ఆయన కమదళంలో చేరారు. గోవిందాస్ కొంతౌజమ్ జూలై 28న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మణిపూర్ సీఎం బీరేన్సింగ్ మాట్లాడుతూ.. ఈశాన్య భారతదేశం అభివృద్ధిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా దృష్టిసారించారని చెప్పారు. ఇటీవల జరిగిన కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఐదుగురు సభ్యులకు చోటు కల్పించడమే అందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అందుకు ప్రతిగా మణిపూర్ కూడా ప్రధాని మోదీకి హామీ ఇస్తున్నదని ఈ అసెంబ్లీ ఎన్నికల ద్వారా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభత్వాన్ని మణిపూర్ మరింత బలోపేతం చేయనున్నదని బీరేన్సింగ్ వ్యాఖ్యానించారు.