న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రాజ్యమేలుతున్నది. నిత్యం లక్షల మంది ఆ మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్నారు. మరోవైపు కరోనా కట్టడి కోసం లాక్డౌన్ విధించడంతో నిర్మాణ, వ్యాపార రంగ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాంతో రెక్కాడితేగాని డొక్కాడని పేదలకు ఉపాధి కరువైంది. తినడానికి తిండిలేక అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో పవర్లిఫ్టింగ్లో అంతర్జాతీయ ఛాంపియన్, జాతీయస్థాయి షూటర్, ఢిల్లీలోని చాందినీ చౌక్ టెంపుల్లో మహంత్ అయిన గౌరవ్ శర్మ పేదల కోసం తనవంతు సాయం చేస్తున్నాడు. అవసరమైన వారికి నిత్యం ఆహారం పొట్లాలు, తాగునీళ్లు అందజేస్తున్నాడు. గత లాక్డౌన్లో కూడా తాను ఇలాగే చేశానని, ఇప్పుడు గత 15 రోజులుగా ఆహారం పంచుతున్నానని గౌరవ్ శర్మ చెప్పాడు. లాక్డౌన్ అమల్లో ఉన్నన్ని రోజులు తన సేవ కొనసాగుతుందన్నాడు.