న్యూఢిల్లీ: సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నగర పోలీసు కమిషనర్గా నియమిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పని చేస్తున్నారు. తక్షణం ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్గా చేరాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్గా రాకేశ్ ఆస్తానా ఏడాది పాటు ఉంటారు. ఈ నెల 31తో ఆయన సూపర్ న్యూమరేషన్ ముగుస్తుండగా.. కేంద్ర హోంశాఖ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. దీంతో బీఎస్ఎఫ్ డీజీగా ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ ఎస్ ఎస్ దేశ్వాల్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
1984 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన గుజరాత్ క్యాడర్ అధికారి.. రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. అటుపై సీబీఐ స్పెషల్ డైరెక్టర్గా నియమితులయ్యారు.
ఏజీఎంయూటీయేతర ఐపీఎస్ క్యాడర్ అధికారిని ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్గా నియమించడం ఇదే మొదటి సారి. ఏజీఎంయూటీ అంటే అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం అండ్ యూనియన్ టెరిటోరీ క్యాడర్ అని అర్ధం.
సీబీఐ ప్రత్యేక డైరెక్టర్గా రాకేశ్ ఆస్తానా.. తన సీనియర్-సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో 2018లో తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగారు. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. దీంతో వారిని సీబీఐ నుంచి తప్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.