న్యూఢిల్లీ/బెంగళూరు, మే 26: అంతర్జాతీయ మార్కెట్ నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేయడానికి పలు రాష్ర్టాలు చేస్తున్న ప్రయత్నాలకు స్పందన వస్తున్నది. రష్యా తయారీ ‘స్పుత్నిక్ వీ’ వ్యాక్సిన్ తమ రాష్ర్టానికి సరఫరా కానున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘రాష్ట్ర అధికారులకు, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారీ ప్రతినిధులకు మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ఈ వ్యాక్సిన్ త్వరలోనే రాష్ర్టానికి రానుంది’ అని తెలిపారు. రాష్ర్టాలు అంతర్జాతీయ మార్కెట్ నుంచి వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని కేంద్రం చెప్తున్నదని, కానీ కొన్ని కంపెనీలు సరఫరా చేయడానికి నిరాకరిస్తున్నాయని పేర్కొన్నారు. ‘వ్యాక్సిన్ల కోసం చాలా రాష్ర్టాలు గ్లోబల్ టెండర్లకు వెళ్తున్నాయి. కానీ చాలా కంపెనీలు నేరుగా రాష్ర్టాలకు సరఫరా చేయడానికి నిరాకరిస్తున్నాయి’ అని కేజ్రీవాల్ చెప్పారు. కరోనాపై పోరులో కేంద్రం తన బాధ్యతను మరువకూడదని సూచించారు. కేంద్రమే వ్యాక్సిన్లను కొనుగోలు చేసి రాష్ర్టాలకు సరఫరా చేయాలని కోరారు. ‘భారత్పై పాకిస్థాన్ యుద్ధం ప్రకటిస్తే.. ఢిల్లీ అణుబాంబును తయారు చేసిందా?.. ఉత్తరప్రదేశ్ యుద్ధట్యాంకును తెచ్చిందా? అని కేంద్రం అడిగినట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉన్నది. వ్యాక్సిన్లను కొనుగోలు చేయడం, రాష్ర్టాలకు సరఫరా చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కర్ణాటక గ్లోబల్ టెండర్లకు స్పందన
రెండు కోట్ల వ్యాక్సిన్ డోసుల కొనుగోలుకు కర్ణాటక ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ప్రకటించగా.. స్పందన వచ్చింది. స్పుత్నిక్ వీ, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్లను తాము సరఫరా చేస్తామంటూ రెండు కంపెనీలు ముందుకువచ్చాయి. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ సరఫరా చేస్తామని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ‘బల్క్ ఎంఆర్వో ఇండస్ట్రియల్ సైప్లె ప్రైవేటు లిమిటెడ్ తెలుపగా.. స్పుత్నిక్ లైట్ను తాము సరఫరా చేస్తామని బెంగళూరు చెందిన తులసి సిస్టమ్స్ పేర్కొంది. ఓ అధికారి మాట్లాడుతూ వ్యాక్సిన్ల ధర, ఇతర నిబంధనలు పూర్తయిన తర్వాత టీకాల కొనుగోలు ముందుకు సాగుతుందన్నారు.