ముంబై : ఇద్దరు భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం చట్టవిరుద్ధం కాదని పేర్కొంటూ ముంబై అడిషనల్ సెషన్స్ జడ్జి సంజశ్రీ జే ఘరత్ తీర్పు ఇచ్చారు. ఇది చట్టం ముందు నిలబడదు అని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ర్టకు చెందిన ఓ వ్యక్తితో బాధిత మహిళకు గతేడాది నవంబర్ 22న వివాహమైంది. పెళ్లైన కొద్ది రోజులకు ఆమె భర్త, కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులకు గురిచేస్తూ, ఆమెపై ఆంక్షలు విధించారు. అంతేకాకుండా వివాహమైన నెల రోజుల తర్వాత తన కోరికకు విరుద్ధంగా భర్త తనతో బలవంతంగా శృంగారం చేసినట్లు బాధిత మహిళ ఆరోపించింది.
ఈ ఏడాది జనవరి 2వ తేదీన భార్యాభర్తలిద్దరూ కలిసి మహాబలేశ్వర్కు వెళ్లారు. అక్కడ కూడా ఆమెపై బలవంతంగా సెక్స్ చేసినట్లు ఆమె పేర్కొంది. నాటి నుంచి ఆమె స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో వైద్యున్ని సంప్రదించింది. డాక్టర్ ఆమెను పరీక్షించిన తర్వాత నడుము కింది భాగం పక్షవాతానికి గురైనట్లు నిర్ధారించాడు.
దీంతో తన భర్త బలవంతంగా శృంగారం చేయడంతోనే ఈ సమస్య వచ్చిపడిందని భావించిన ఆమె.. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు కోర్టుకు చేరడంతో.. విచారణ సందర్భంగా బాధితురాలు తన వాదనను వినిపించింది. దంపతుల మధ్య బలవంతపు శృంగారం చట్టం ముందు నిలబడదు అని జడ్జి స్పష్టం చేశారు. కానీ ఆమె పక్షవాతానికి గురవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. మొత్తానికి ఈ కేసులో బాధితురాలి భర్తకు బెయిల్ మంజూరైంది.