రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
ఎలుబాకలో చిరుతల రామాయణం ప్రారంభం
వీణవంక, మార్చి 31: సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మనదని, రామాయణం, మహాభారతం దేశానికే తలమానికమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మండలంలోని ఎలుబాక గ్రామంలో భక్త కళామండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరుతల రామాయణాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజంలో మానవ సంబంధాలను పరిపుష్టి చేసేవి రామాయణం, మహాభారతం అని, వాటికి ప్రాధాన్యత ఇస్తే మనుషుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతాయని పేర్కొన్నారు. సమాజంలో టీవీలు, సెల్ఫోన్ల ద్వారా మానవ సంబంధాలు తెగిపోయాయని అన్నారు. ప్రస్తుతం న్యాయం, ధర్మం గెలవాలంటే రామాయణం, మహాభారతం గ్రామాల్లో ప్రదర్శించాలని సూచించారు. అంతకు ముందు కొండపాక, చల్లూరు, గంగారం గ్రామాల్లో మృతుల కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్రావు, జడ్పీటీసీ మాడ వనమాల, వైస్ ఎంపీపీ లత, టీఆర్ఎస్ నాయకుడు కొమురయ్య, సర్పంచ్ కాంతారెడ్డి, నాయకులు మాడ సాదవరెడ్డి, ముసిపట్ల తిరుపతిరెడ్డి, గౌతంరెడ్డి, రవీందర్రావు, శంకర్, కోమల్రెడ్డి, కాసం వీరారెడ్డి పాల్గొన్నారు.
రాం ఫణీంద్రా చిరంజీవి
హుజూరాబాద్ టౌన్, మార్చి 31: రాం ఫణీంద్ర భౌతికంగా లేకపోయిన అవయవ దానం ద్వారా చిరంజీవిగా నిలిచాడని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ఇందిరానగర్కు చెందిన జానపట్ల రాంఫణీంద్ర(29) హైదరాబాద్లోని యశోదలో చికిత్స పొందుతూ మృతిచెందగా, ఆయన కుటుంబ సభ్యులను బుధవారం మంత్రి ఈటల పరామర్శించారు. బ్రేయిన్ డెడ్ అయిన కుమారుడి అవయవాలను ఇతరులకు దానం చేసేందుకు ముందుకు వచ్చిన రాంఫణీంద్ర తల్లి చంద్రకళను మంత్రి అభినందించారు. ఆమెను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, వ్యవసాయశాఖ ఏడీఏ దామోదర్రెడ్డి, ఏవో సునీల్కుమార్, కౌన్సిలర్ తొగరు సదానందం, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, నాయకులు తదితరులు ఉన్నారు.