న్యూఢిల్లీ, మే 22: దేశంలో వరుసగా ఆరవ రోజూ రోజువారీ కరోనా కేసులు మూడు లక్షలలోపే నమోదయ్యాయి. శుక్రవారం నుంచి శనివారం నాటికి 24 గంటల్లో 2.57 లక్షల కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,62,89,290కి చేరింది. ప్రస్తుతం 29,23,400 మంది మాత్రమే (11.12 శాతం మంది) చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశంలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 10న 24.83 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 22వ తేదీ నాటికి 12.45 శాతానికి పడిపోయిందని చెప్పారు. కరోనా బారిన పడిన వారిలో తాజాగా 4,194 మంది మరణించారని, దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,95,525కు పెరిగిందని అధికారులు వివరించారు.