లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జాన్పూర్ జిల్లాలోని రౌజా ఆర్జన్ ఏరియాలో ఘోరం జరిగింది. రెండంతస్తుల ఓ పురాతన భవనం కూలిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రౌజా ఆర్జన్ ఏరియాకు చెందిన కమరుద్దీన్, జమాలుద్దీన్ ఓ పురాతన రెండంతస్తుల భవనంలో నివాసం ఉంటున్నారు.
అయితే ఇటీవల కురిసిన వర్షాలకు బాగా నానిపోయిన భవనం గురువారం రాత్రి 11 గంటలకు కూలిపోయింది. దాంతో నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలోనే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ విచారం వ్యక్తంచేశారు.
కాగా, మృతుల్లో ఒక మహిళ, ఒక వృద్ధుడు, ఇద్దరు యువకులు, ఒక మైనర్ బాలుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు. గాయపడిన వారు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.