శ్రీనగర్: జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంబన్ జిల్లాలోని డిగ్డోల్ సమీపంలో మినీ ట్రక్కును ఓ కారు ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాంబన్ నుంచి నీల్ గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు. కాగా, నాలుగు రోజుల వ్యవధిలో రాంబన్లో ఇది రెండో ప్రమాదం. గత బుధవారం జిల్లాలోని ఖూనీ నాలా ప్రాంతంలో ఓ వాహనం లోయలో పడిపోయింది. దీంతో నలుగురు కార్మికులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.
కాగా, ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని చెప్పారు.