సిమ్లా : కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఐదుగురు కార్మికులను ఓ భవన నిర్మాణ కాంట్రాక్టర్ పబ్లిక్ టాయ్ లెట్ లో ఐసోలేట్ చేసిన దారుణ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో వెలుగుచూసింది. చంబాలోని పంగి ట్రైబల్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న బస్టాండ్ లోని సులభ్ శౌచాలయలో తన కార్మికుల్లో కొవిడ్ పాజిటివ్ గా తేలిన ఐదుగురు కార్మికులను కాంట్రాక్టర్ ఐసోలేట్ చేశాడు. బస్టాండ్ నిర్మాణం కోసం 20 మంది కార్మికులను ఆ ప్రాంతానికి కాంట్రాక్టర్ రప్పించగా ఐదుగురికి కొవిడ్-19 సోకినట్టు వెల్లడైంది.
టెస్టు రిపోర్టులు రాగానే వారిని క్వారంటైన్ సెంటర్ లో చేర్చేందుకు నిరాకరించిన కాంట్రాక్టర్ పబ్లిక్ టాయ్ లెట్ లో ఉంచాడని స్ధానిక ఆప్ నేత మహ్మద్ సలీం పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఘటనా స్ధలానికి స్ధానిక వైద్యాధికారిని పంపామని, కొవిడ్ పాజిటివ్ గా తేలిన ఐదుగురు కార్మికులను బస్టాండ్ లోని వేరే బ్లాక్ కు తరలించామని చంబా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ కపిల్ శర్మ తెలిపారు.